ఎక్కడో కాదు: రాజధానిపై బాబు, ప్రత్యేకహోదాపై డైలమా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో మారుమూల ఉండదని, అందరికీ అందుబాటులో ఉండేలా మధ్యలో ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో స్పష్టం చేశారు. రాజధానిగా ఎక్కడ ఏర్పాటు చేసినప్పటికీ, ఏపీలో ప్రతీ ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజాభీష్టం మేరకే రాజధానిని ఎంపిక చేస్తామన్నారు. విభజన వల్ల ఏపీకి వచ్చిన ఆదాయ లోటును భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది ఎంత ఖర్చు చేయగలరో ప్రతిపాదనలు పంపితే అంత మొత్తం ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. చంద్రబాబుతో భేటీ సందర్భంగా సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి సాయం అందాల్సిన తీరుపై రాజ్యసభలో తామే పోరాడినందున ఇప్పుడు దానిని అమలు చేయడం తమ బాధ్యత అని జైట్లీ చెప్పారట. తాజా బడ్జెట్లోనే పలు అంశాలుక ఎంతోకొంత ప్రతిపాదనలు పెట్టినందున ఇబ్బంది లేకుండా నిధులు విడుదల చేస్తామని బాబుకు చెప్పారు.
ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తిపై తర్జన భర్జన
కేంద్రంలో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడంతో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించడం పైన ఏ రూపంలో సిఫార్సు తీసుకోవాలన్న దాని పైన కేంద్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖనే నేరుగా సిఫార్సు చేయవచ్చా లేక ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటవుతున్న సంస్థతో సిఫార్సు చేయించాలా అనే దానిపై అధ్యయనం చేస్తోంది. కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.
చంద్రబాబు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. దీనిపై జైట్లీ ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా తెలుస్తోంది. పునర్విభజన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన సమయంలో అప్పటి ప్రధాని చేసిన ప్రకటనలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ప్రధానమైనది. ఆ తర్వాత దీని పైన సిఫార్సు చేసే బాధ్యతను ప్రణాళిక సంఘానికి అప్పగించారు. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రణాళిక సంఘాన్ని రద్దు చేశారు. దీంతో ఈ బాధ్యత ఎవరిదన్న దానిపై చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications