రాష్ట్రపతిని కలిసిన బాబు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తేదీలు ప్రకటించిన మంత్రి గంటా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆయనకు చంద్రబాబు పుష్పగుచ్ఛం అందించారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తేదీల ప్రకటన
శాసనసభలో ఆమోదం పొందిన ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయాలన్న కుట్రతోనే ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదించిందనే వాదన ప్రజల్లోకి వెళ్తోందని, అలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.

ఇందుకుగాను ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ యూనివర్సీటీలను బలోపేతం చేస్తామన్నారు. ఉన్నత విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగానే మొట్టమొదటిసారిగా ప్రైవేటు యూనివర్సిటీలను ఆహ్వానిస్తున్నామన్నారు.
ఉగాది నాటికి విద్యాశాఖ పూర్తిగా అమరావతికి తరలిస్తామన్నారు. విద్యా భవన్ పేరిట ఒకే భవనం అందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తేదీలను ఆయన ప్రకటించారు. మే 5న ఎంసెట్, మే 9న ఈ సెట్, మే 16న ఐసెట్, మే 23న ఎడ్ సెట్, మే 26న పిజీ సెట్, మే 28 లా సెట్, మే 28న పీజీ లా సెట్, మే 9న పీసెట్ ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications