నడ్డాతో చంద్రబాబు భేటీ, పురందేశ్వరి చొరవ - ఇష్టం లేకపోయినా..!!
ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. బీజేపీ వైఖరి స్పష్టం కావలసి ఉంది ఇదే సమయంలో ఢిల్లీ వేదిక జరిగిన ముఖాముఖి సమావేశం ఆసక్తికరంగా మారుతోంది.
నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల సమయంలో కేంద్రం స్మారక చిహ్నం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ఎన్టీఆర్ స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరయ్యారు. ప్రత్యేకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పురందేశ్వరి ఆహ్వానించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం కావటం మంతనాలు జరపటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కొద్దిరోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో అమిత్ షా తో సమావేశమయ్యారు. ఆ సమయంలో నడ్డా కూడా అందులో పాల్గొన్నారు. ఆ సమయంలో చర్చ జరిగినట్లు ప్రచారం జరిగింది.కానీ తర్వాతి కాలంలో ఎన్డీఏ సమావేశానికి బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు కానీ చంద్రబాబును పిలవలేదు. దీంతో బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందా రాదా అనే డైలమా కొనసాగుతోంది.అటు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలతో మరింత అస్పష్టత కనిపిస్తోంది.

ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో జగన్ ను ఓడించి అధికారం దక్కించుకోవాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం బీజేపీ సహకారం కూడా తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.ఈ ప్రయత్నంలో పురందేశ్వరి సహకరిస్తున్నారని వాదన ఉంది. తాజాగా ఢిల్లీలో నడ్డా చంద్రబాబు సమావేశం దిశగా పురందేశ్వరి చొరవ తీసుకున్నారనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని నందమూరి కుటుంబ సభ్యుల సన్నిహితులు చెబుతున్నా, రాజకీయంగా ఈ చర్చ పైన ఆసక్తి కనిపిస్తోంది.
ఇంతకంటే ఆధారం కావాలా? చిన్నమ్మా! పురంధేశ్వరి! పతీసమేతంగా మరిదిని తీసుకెళ్లి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం. బీజేపీకి తెలీదా, మీరంతా ఒకటే అని. అందుకేకదా దొంగ చేతికే తాళం ఇచ్చింది! pic.twitter.com/tdrYPVvIQH
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2023
ఈ భేటీ పైన వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ పురందేశ్వరిని ఉద్దేశించి సాయి రెడ్డి ట్విట్ చేశారు. బీజేపీకి తెలియదా మీరంతా ఒకటే అని,అందుకే కదా దొంగ చేతికి తాళం ఇచ్చింది అంటూ సీరియస్ కామెంట్ చేశారు.
ఏపీలో జనసేనతో మాత్రమే తమకు పొత్తు ఉంటుందని బీజేపీ ముఖ్య నేతలు పదేపదే చెప్తూ వస్తున్నారు. టీడీపీ తో కలిసే విషయం పైన బీజేపీ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతనే పవన్ తన వైఖరి స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, బీజేపీని ఒప్పించి ముందుకెళ్లే ప్రయత్నాలు చంద్రబాబు కొనసాగిస్తున్నారు. దీంతో టీడీపీ బీజేపీ విషయంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications