మందుబాబులకు బిగ్ షాక్.. తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు!
తెలంగాణలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచే దిశగా తెలంగాణా సర్కార్ ఆలోచనలు చేస్తోందని తెలుస్తోంది. వైన్ షాపుల యజమానులు, బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు మద్యం తయారీదారులు గత కొంతకాలంగా ఎచేస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని, ధరల సవరణపై ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న ధరలతో వ్యాపారం చేయలేమంటున్న వ్యాపారులు
ముడిసరుకుల ధరలు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రస్తుతమున్న మార్జిన్లతో తాము వ్యాపారం చేయలేకపోతున్నామని, అందుకే ధరలను పెంచాలని లిక్కర్ అసోసియేషన్లు ప్రభుత్వానికి అధికారికంగా వినతిపత్రాలు సమర్పించాయి.లిక్కర్ ఇండస్ట్రీ ప్రతినిధులు ముఖ్యంగా బ్రాండ్ను బట్టి కనీసం 10 నుండి 15 శాతం వరకు ధరలను పెంచాలని కోరుతున్నారు.

కమీషన్ మార్జిన్లను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్న వైన్ వ్యాపారులు
ఆర్డినరీ, మీడియం మరియు ప్రీమియం కేటగిరీల లిక్కర్ బాటిళ్లతో పాటు, బేసిక్ బీర్ల ధరలపై కూడా కొంత మేర పెంచాలని ప్రతిపాదనలు పెట్టారు. దీనికి తోడు తమకు వచ్చే కమీషన్ మార్జిన్లను కూడా పెంచాలని వైన్ వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో పోలిస్తే తెలంగాణలో కొన్ని బ్రాండ్లధరలు తక్కువగా ఉన్నాయని, దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదని గుర్తు చేస్తున్నారు.
అదనపు ఆదాయ వనరులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి మరియు సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి అదనపు ఆదాయ వనరులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే రాబడిని పెంచేందుకు ఈ ధరల పెంపు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.
ధరలు పెరిగే అవకాశం
అధికారులు త్వరలోనే ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఏయే బ్రాండ్లపై ఎంత మేరకు ధరలు పెంచవచ్చనే దానిపై ఒక నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ నివేదికకు ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే, రాబోయే కొన్ని రోజుల్లోనే కొత్త మద్యం ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ధరలు పెంచితే మందుబాబులకు మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.













Click it and Unblock the Notifications