వదిలేది లేదు: సీఎం రమేష్ సంస్థపై చంద్రబాబు తీవ్ర హెచ్చరిక
ఇప్పటికే జిల్లాలో ఎదురవుతున్న ఆధిపత్యపోరుతో సతమవుతున్న టీడీపీ రాజ్యసభసభ్యుడు సీఎం రమేష్కు ఏకంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచే చేదు అనుభవం ఎదురైంది.
అమరావతి: ఇప్పటికే జిల్లాలో ఎదురవుతున్న ఆధిపత్యపోరుతో సతమవుతున్న టీడీపీ రాజ్యసభసభ్యుడు సీఎం రమేష్కు ఏకంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచే చేదు అనుభవం ఎదురైంది. సీఎం రమేష్కు చెందిన రిత్విక్ సంస్థ పనితీరుపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
సీఎం వర్సెస్ ఆది: ఆధిపత్య పోరు, బాబు దూరంతో తీసికట్టుగా రమేష్ పరిస్థితి!
సోమవారం చంద్రబాబునాయుడు నిర్వహించిన పోలవరం, ఇతర ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రమేష్ కంపెనీ నిర్వహిస్తోన్న గండికోట ప్రాజెక్ట్ పనుల నత్తనడకను బాబు ప్రత్యేకంగా ప్రస్తావించడంతోపాటు, తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేయడం గమనార్హం.
ఊహించని స్థాయిలో చంద్రబాబు ఆగ్రహం
గత మూడు,నాలుగు వారాల నుంచి రిత్విక్ కంపెనీ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. అయితే సోమవారం మాత్రం ఎవరూ ఊహించని స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, పోలీసులను పంపి సామాగ్రిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించే వరకూ వెళ్లడం అటు పార్టీ వర్గాల్లోనూ చర్చనీయాంశమయింది.
ఎవరినీ వదిలిపెట్టమంటూ హెచ్చరిక
కాగా, ప్రాజెక్టుల సమీక్ష సందర్భంగా కంపెనీ బాధ్యుడిగా వ్యవహరిస్తోన్న సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్ వీడియో కాన్ఫరెన్సుకు హాజరుకాకపోవడాన్ని బాబు తీవ్రంగా పరిగణించారు. ఆయన వీడియో కాన్ఫరెన్సుకు ఎందుకు రాలేదని ప్రశ్నించి, సీరియస్నెస్ లేకపోతే ఎవరినీ వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. ఇరిగేషన్ పనుల్లో జాప్యం జరిగితే ఎవరినైనా సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
సీఎం రమేష్ కంపెనీ చేతిలో 3వేల కోట్లు..
ప్రస్తుతం సీఎం రమేష్కు చెందిన ఈ సంస్థ చేతిలో రాష్ట్రంలో 3 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులున్నాయి. అయితే, నిర్ణీత లక్ష్యంలోగా వాటిని పూర్తి చేయకపోవడం, నాసిరకం పనులు చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు రావడంతో ముఖ్యమంత్రి వాటిపై సీరియస్గా దృష్టి సారించారు. పోలవరం సహా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై వ్యక్తిగతంగా సమీక్షిస్తూ.. కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
కుప్పంలోనూ అంతే.. అందుకు బాబు సీరియస్..
సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయటం ద్వారా రానున్న ఎన్నికల్లో రైతులను, ప్రజల నుంచి మెప్పు పొందడమే లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే దానికి అనుగుణంగా రిత్విక్ సహా పలు కంపెనీలు పనిచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు చంద్రబాబునాయుడు నియోజకవర్గమైన కుప్పంలోకూడా పనులు పెండింగ్లో ఉన్న వైనం మీడియాలో విమర్శలకు గురవడంతో స్వయంగా చంద్రబాబునాయుడే రిత్విక్పై దృష్టిసారించాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాయపాటి కంపెనీకి కత్తెరలు..
పోలవరం కాంట్రాక్టర్ టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరావే అయినప్పటికీ, సకాలంలో పనులు చేయకపోవడం, సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో దాదాపు ప్రతి సోమవారం ఆ కంపెనీ పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ సకాలంలో పనులుచేయనందున, 60సి ప్రకారం కొంతమేరకు పనులను ఇతర కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయించారు. ముందు తాను రాయపాటి కంపెనీని కాపాడుతున్నానని కొన్ని పత్రికల్లో వార్తలు రాశారని, తాను ఇప్పుడు ఆ కంపెనీ సరిగ్గా పనిచేయలేకపోతోందని కేంద్రానికి చెబితే మళ్లీ ఆ కంపెనీనే కొనసాగించాలని రాస్తున్నారని చంద్రబాబు అన్నారు. తనకు ఎవరు పని చేస్తున్నారన్న ముఖ్య కాదని.. సకాలంలో పనులు కావడం ముఖ్యమని చంద్రబబు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులు ఆలస్యం చేస్తే ఎవరినైనా సహించేది లేదని తేల్చి చెప్పారు.
సీఎం రమేష్పై ఇప్పటికే..
అటు రాయపాటి, ఇటు సీఎం రమేష్లు సొంత పార్టీ నేతలే అయినప్పటికీ చంద్రబాబు ఇంత తీవ్రంగా హెచ్చరించడం టీడీపీ నేతలను విస్మయానికి గురిచేసింది. అయితే, ఈ పరిణామాలు గమనించినట్లయితే చంద్రబాబు ఇరిగేషన్ పనులకు ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టమవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పార్టీ అధినేతతో ఇప్పటికే సీఎం రమేష్ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చర్చనీయాంశంగా మారింది.