జగన్ దత్తపుత్రుడు, కెసిఆర్ అద్దె పుత్రుడు: బాబు
విశాఖపట్నం: కాంగ్రెసుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దత్తపుత్రుడని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అద్దె పుత్రుడని, వారిద్దరి సహకారంతో తమ పార్టీని దెబ్బ తీయాలని కాంగ్రెసు కుట్రలు చేసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. విశాఖపట్నంలో బుధవారం రాత్రి జగిరిన ప్రజా గర్జన సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు సమక్షంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, మరో నలుగరు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
తమ పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని చంద్రబాబు అన్నారు. తెలంగాణను, హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు అన్నారు. విశాఖపట్నాన్ని ముంబై తర్వాత ఆర్థిక రాజధానిగా చేస్తానని ఆయన చెప్పారు. విశాఖపట్నం ఒకప్పుడు సింగపూర్ మాదిరిగా సుందరనగరమని ఆయన అన్నారు. సీమాంధ్రలో ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయని, తమ పార్టీ మాత్రమే గెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణలో మళ్లీ తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు.
అధికారం వస్తే దోచుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. సామాజిక తెలంగాణ తెస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీలో చక్రం తిప్పేది తమ పార్టీయేనని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరమని ఆయన అన్నారు. కాంగ్రెసు తాను తీసుకున్న గోతిలో తానే పడిందని ఆయన అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ విభజనపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని, వారికి బాధ్యత లేదా అని అడుగుతున్నానని ఆయన అన్నారు.
కాంగ్రెసును భూస్థాపితం చేస్తానని ఆయన అన్నారు. తెలుగుజాతి పౌరుషం చూపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తాము పదవుల కోసం పాకులాడలేదని, ప్రజల కోసం పోరాటం చేశామని ఆయన అన్నారు. ఎన్డీయె హయాంలో కేంద్రంలో పది మంత్రి పదవులైనా ఇచ్చేవారని, అయితే తమకు పదవులు వద్దనీ రాష్ట్రాభివృద్ధికి సహకారం కావాలని తీసుకున్నామని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సహకారంతో జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రిగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేదని, సోనియాతో పోరాడలేదని, తన పేరుతో ఎప్పుడూ గెలవలేదని ఆయన అన్నారు. వైయస్ జగన్, కెసిఆర్, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసుతోనే ఉన్నారని ఆయన అన్నారు. టిడిపి గెలుస్తుందని చెప్పి ఓట్లు సంపాదించుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టారని ఆయన అన్నారు. ఢిల్లీ నాయకుల గుండెల్లో ఎన్టీ రామారావు రైళ్లు పరుగెత్తించారని ఆయన అన్నారు.
తన చివరి రక్తం బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతానని ఆయన అన్నారు. తనను ప్రధానిని చేస్తానంటే రెండు సార్లు రాష్ట్రం ముఖ్యమని వద్దన్నానని ఆయన చెప్పారు. ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఈ రోజు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే తానే చేశానని ఆయన చెప్పారు.