ఎవ్వరకీ భయపడేది లేదు!.. కేంద్రంతో తెగదెంపులు నిమిషం పని: చంద్రబాబు
తానెవ్వరికీ భయపడబోనని, కేంద్రంతో రాజీ కుదుర్చుకున్నానని కొంతమంది చేస్తున్న ప్రచారంలో నిజంలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
అనంతరం : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో సీఎం చంద్రబాబు రాజీపడ్డారని, ఓటుకు నోటు కేసు ఎక్కడ తిరగడుతారోనన్న భయంతోనే కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదని ప్రతిపక్ష పార్టీ ఆయనపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అనంతపురం జిల్లా గొల్లపల్లిలో పర్యటన సందర్బంగా.. దీనిపై స్పందించారు చంద్రబాబు.
తానెవ్వరికీ భయపడబోనని, కేంద్రంతో రాజీ కుదుర్చుకున్నానని కొంతమంది చేస్తున్న ప్రచారంలో నిజంలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. హోదాపై కేంద్రంతో మాట్లాడడానికి తాను భయపడుతున్నానని, తాను ఎన్నడూ ఎవ్వరికీ భయపడలేదని తేల్చి చెప్పారు. కేంద్రంతో తెగదెంపులు చేసుకోవడం నిమిషంలో జరిగిపోయే పని అని, కానీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అది మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే.. ప్రత్యేక హోదా స్థానంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి ఒప్పుకున్నానని తెలిపారు. తానింతగా కష్టపడేది, అధికారులను పనిచేయాలని కోరేది ప్రజల కోసమేనని చంద్రబాబు చెప్పారు. ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించుకుని తాము ముందుకు వెళ్తున్నామని.. ఇదే క్రమంలో వచ్చే ఏడాది గోదావరి నుంచి వట్టిసీమ ద్వారా అనంతపురానికి నీరు తీసుకొస్తామని అనంత ప్రజలకు భరోసా ఇచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చడమే ప్రభుత్వ ముఖ్య బాధ్యత అని నదుల అనుసంధానం ద్వారా అన్ని ప్రాంతాలకు నీరందిస్తామని తెలిపారు. పేదవారికి అండగా నిలబడడమే తమ ప్రభుత్వం ధ్యేయమని ఈ సందర్బంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ కష్టాల నుంచి టీడీపీ మాత్రమే గట్టెక్కిస్తుందని, వారి సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం శ్రమిస్తోందని తెలియజేశారు.