ఔను...మోడీ,బాబు కలసి మాట్లాడుకొని రెండేళ్లవుతోంది...మరి న్యూ ఇయర్ లోనైనా...
అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...వీళ్లిద్దరి కలసి మనసిప్పి మాట్లాడుకొని సుమారుగా రెండేళ్లవుతోంది. మరి కొన్ని గంటల్లో న్యూ ఇయర్ రాబోతుంది. మరి కొత్త సంవత్సరంలోనైనా...
నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు...ఇద్దరూ రాజకీయల్లో యోధానుయోధులే...2014 ఎన్నికల సందర్భంగా ఈ పొలిటికల్ లెజెండ్స్ చేతులు కలిపారు. అధికారం చేజిక్కించుకున్నారు. దీంతో విభజనతో కుదేలైన ఆంధ్రప్రదేశ్ ను ఈ జోడీ అభివృద్ది పధంలో పరుగులు పెట్టిస్తుందని అందరూ భావించారు. అయితే ఆ తరువాత ఏమైందో ఏమో కానీ...మోడీ మెల్లిగా చంద్రబాబుకు మెండి చేయి చూపడం ప్రారంభించారు. ఆ తరువాత అసలు కలవడమే మానేసారు. అలా వీళ్లిద్దరూ కలసి సమావేశమై ఇంచుమించు రెండు సంవత్సరాలవుతోంది.
చివరిసారిగా ఎప్పుడంటే...
మోడీ, చంద్రబాబు ఇద్దరూ కలసి తీరుబడిగా రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడుకొని దగ్గర దగ్గరగా రెండేళ్లవుతోంది. ఇంకా చెప్పాలంటే వాళ్లిద్దరు బాగా కలసిమెలసి సన్నిహితంగా మెలుగుతూ ఒకరినొకరు ప్రశంసించుకున్నది నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంలోనే. ఆతర్వాత జూన్ 19న ప్రధాని ముఖ్యమంత్రి కి ఫోన్ చేసి రాష్ట్ర పతి ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ కు మద్దతునీయాలని కోరారు. గుజరాత్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీతో సమావేశమయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నించినా నమస్కారం చెయ్యడానికి వీలైందే తప్ప భేటీ అయ్యేందుకు సాధ్య పడలేదు.
ప్రయత్నాలు విఫలం...
చంద్రబాబుకు మోడీ నో అపాయింట్ మెంట్ అనే ప్రచారం మొదలైన తరువాత కూడా మోడీ నుంచి దిద్దుబాటు, సర్ధుబాటు చర్యలేమీ లేవు. మోడీని కలిసేందుకు చంద్రబాబు చొరవ తీసుకున్నా, చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నా ప్రధానితో సమావేశమయ్యేందుకు ప్రయత్నించిన సందర్భంలో ప్రధాని కార్యాలయం నుంచి ప్రధాని బిజి అనే పేరుతో భేటీ సాధ్యమయ్యేది కాదు. సెప్టెంబర్ లో 25, 26 తేదీలలో చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. సెప్టెంబర్ 25 ప్రధాని అప్పాయంట్ మెంట్ అడిగారు. ప్రధాని కార్యాలయం ఇవ్వలేదు. సెప్టెంబర్ 26న మళ్లీ గుర్తు చేశారు. అయినా అపాయింట్ మెంట్ రాలేదు. చివరకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం కోసం అడిగారు. అదీ జరగలేదు.
మరి వైసిపితో...ఇదెలా..
అయితే సిఎం చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వని మోడీ వైసిపి నేతలకు ఆ అవకాశం ఇవ్వడం మోడీ, బాబు సంబంధాల పై అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2017 మే నెలలో ప్రధాని మోడి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇటీవలే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో కూడా మోడీ సమావేశమయ్యారు.
దీంతో అనేక ఊహాగానాలు...
దీంతో అప్పటినుంచి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయని, రాజధాని, పోలవరం వ్యవహారాలతో సహా అనేక విషయాల్లో ముఖ్యమంత్రి పద్దతి కేంద్రానికి నచ్చకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రచారం సాగుతోంది. దీనికితోడు ఎపి బిజెపి నేతలు సైతం టిడిపి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుండటం, ఇటీవలి కాలంలో ఆ విమర్శలు తారాస్థాయికి చేరడం పరిస్థితిని పతాక స్థాయికి చేర్చింది. ఇక బిజెపి,టిడిపి కలసి ఉండటం కష్టమని, త్వరలోనే విడిపోవడం ఖాయమనే ఊహాగానాలు జోరుగాసాగుతున్నాయి
పెట్రోలియం యూనివర్శిటీ కోసం...
2017 ఆగస్టు నాలుగో తేదీన విశాఖ లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియమ్ అండ్ ఎనర్జీకి సంబంధించిన బిల్లు పాసయింది. ఇది ప్రతిష్టాత్మకమయిన ప్రాజెక్ట్. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమి ఇస్తే, కేంద్రం రు.650 కోట్ల నిధులు ఇచ్చింది. ఈ సంస్థను ఖరగ్ పూర్ ఐఐటి పర్యవేక్షిస్తుంది. కాబట్టి విశాఖలో జనవరిలో జరిగే పెట్రోలియం యూనివర్శిటీ శంఖుస్థాపనకు ప్రధాని మోడీ రావాలి. పైగా ఇది రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హమీ కూడా. రాజకీయ పరంగా చూసుకున్నీ ఈ కార్యక్రమానికి రావడం ప్రధానికి చాలా అవసరం. ఎందుకంటే, ఆలస్యంగా నైనా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రజలకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది.
మోడీ వస్తారా?...రారా?
అయితే ఈమధ్యే ఇదే విషయం మీద టిడిపి ఎంపిలు ప్రధాని మోడీని పార్లమెంటులో కలసి విశాఖకు ఆహ్వానించినపుడు ప్రధాని సుముఖంగా స్పందించారని చెబుతున్నారు. అయినా మరోవైపు ఈ కార్యక్రమానికి మోడీ వస్తారా...రారా...ఒకవేళ వచ్చినా చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు అవకాశం ఇస్తారా? లేక గుజరాత్ లో లాగా చేస్తారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు టిడిపి నేతల మెదళ్లను తొలిచేస్తున్నాయి.