కేంద్రం తీరుకు వ్యతిరేకంగా చంద్రబాబు నిరాహార దీక్ష ప్రారంభం
Recommended Video
విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తన జన్మదినం రోజున 'ధర్మ పోరాట దీక్ష' పేరిట నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు.
శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష రాత్రి ఏడింటి వరకు కొనసాగనుంది. దీక్షా స్థలికి చేరుకున్న చంద్రబాబు ముందుగా మహాత్మాగాంధీ, అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాల వేశారు.
అనంతరం 'మా తెలుగు తల్లికి మల్లెపూ దండ' ఆలపించారు. దీక్షలో చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పావులూరి శివరామకృష్ణ చంద్రబాబుకు నూలుపోగు దండ వేసి అభినందించారు.
మత పెద్దల ఆశీర్వచనాలు
ముఖ్యమంత్రి వేదికపైకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం, దుర్గగుడికి చెందిన వేదపండితులు, క్రైస్తవ, ముస్లిం మతపెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పలువురు స్వాతంత్య్ర సమరయోధులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. మాజీ సైనికులు ముఖ్యమంత్రిని కలసి సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఏడింటికి దీక్ష విరమించాక ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీక్షకు సంఘీభావంగా హాజరైన వివిధ పార్టీలు, సంఘాల నాయకులతో మాట్లాడిస్తారు.
చంద్రబాబు దీక్షకు సినీ పరిశ్రమ నుంచి పలువురు వచ్చి సంఘీభావం తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ, అశ్వనీదత్, తదితరులు చంద్రబాబు దీక్ష వేదికకు చేరుకుని మద్దతు తెలిపారు.
విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు చేస్తున్న పోరాటంలో భాగంగా చంద్రబాబు ఈ దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించకుండా, దీక్షల ద్వారా అందరూ కేంద్రంపై ధర్మాగ్రహం ప్రకటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ఏపీలోని 13 జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు కూడా తమ తమ ప్రాంతాల్లో దీక్షలకు దిగారు.