తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు..: ముద్రగడ అరెస్టుపై జగన్ ట్వీట్
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధంతో పాటు కాపు నేతల అరెస్ట్లపై వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకవైపు వైఎస్ జగన్ ట్వీట్ ద్వారా చంద్రబాబునాయుడిని ప్రశ్నించగా, మరోవైపు కన్నబ
అమరావతి: 'చలో అమరావతి' పాదయాత్రకు అనుమతి లేదంటూ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను 24 గంటలపాటు గృహ నిర్బంధం చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
కాపు రిజర్వేషన్లపై టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి 'చలో అమరావతి' పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన తలపెట్టిన ఈ పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ని అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు.
ప్రశ్నిస్తే అరెస్టులు, బైండోవర్లా?: వైఎస్ జగన్
ముద్రగడ అరెస్ట్పై ఆయన ట్విట్టర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి గారు.. ఒక్క విషయం చెప్పండి. ముద్రగడను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు. కాపులకు మీరిచ్చిన హామీని, మేనిఫెస్టోలో మీరిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అనేకదా వారు మిమ్మల్ని నిలదీస్తున్నది. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు అరెస్ట్లు, బైండోవర్లు చేయడం ఏంటి? వేలమంది పోలీసులు మోహరించడమేంటి?.. తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు..' అంటూ వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
హామీ అమలు చేయమనడం తప్పా?: కన్నబాబు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధంతో పాటు కాపు నేతల అరెస్ట్లపై వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు కాకినాడలో మాట్లాడుతూ.. కాపులను అణచివేస్తున్న చంద్రబాబు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారన్నారు. జిల్లా నుంచి పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. హామీని అమలు చేయాలని కోరడమే కాపులు చేసిన తప్పా? అని కన్నబాబు ప్రశ్నించారు. కాపులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబుకు భవిష్యత్లో ప్రజల మధ్య తిరగలేని పరిస్థితి వస్తుందన్నారు.
Recommended Video
మాపై ఎందుకింత కక్ష?: అంబటి రాంబాబు
‘రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఉందా? కాపులను ఎంతకాలం అణచివేస్తారు? వ్యక్తిగత పనికోసం వెళ్తుంటే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. మా మీద ఎందుకింత కక్ష సాధింపు, మేమేం తప్పు చేశాం. ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరపాలి కానీ ఉద్యమాన్ని అణివేయాలనుకోవడం సరికాదు.' అని గుంటూరులో వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నమ్మకద్రోహం: కరణం ధర్మశ్రీ
కాపులను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని మూడేళ్లయినా అమలు చేయలేదన్నారు. హామీని అమలు చేయమని కోరడమే నేరమా? కాపులను అవమానిస్తే ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు.
ఇంత నిరంకుశమా?: లింగంశెట్టి ఈశ్వరరావు
ముద్రగడ పద్మనాభం అరెస్టు పై కాంగ్రెస్ నేత లింగంశెట్టి ఈశ్వరరావు స్పందిస్తూ.. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని వ్యాఖ్యానించారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకోవడం దారుణమని, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.