గల్లా, రమేష్కు బాబు క్లాస్: 'పదవులు వదులుకోండి'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎంపీలకు అదనపు పదవులు వద్దని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఒలింపిక్ సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో గల్లా జయదేవ్, సీఎం రమేశ్ల మధ్య నెలకొన్న వివాదాన్ని ఆయన పరిష్కరించినట్లు తెలుస్తోంది.
ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎంపీలు పార్లమెంటులో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు వారు పూర్తి సమయాన్ని కేటాయించాలని సూచించారు. ఎంపీలైన వారిద్దరూ ఈ పదవిని తీసుకోవద్దని ఆదేశించడంతో పాటు, ఆ పదవిని పార్టీలో మరేవరికైనా ఇవ్వాలని నిర్ణయించారట.
మంగళవారం నాడు ముస్సోరిలో సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన బాబు ఢిల్లీలోని ఏపీ భవన్ గురజాడ సమావేశ మందిరంలో పార్టీ ఎంపీలతో సమావేశం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది.

ఈ సమావేశానికి ముందు చంద్రబాబు ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేశ్లను తన కాటేజీకి పిలిపించి, ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా నెలకొన్న వివాదాన్ని తక్షణం పరిష్కరించుకోవాలని, ఇరువురూ కూర్చుని, చర్చించుకుని ఒక పరిష్కారానికి రావాలని సూచించారని పార్టీ వర్గాల సమాచారం.
ఒక పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఒకే పదవికి పోటీ పడటం వల్ల పార్టీకి, రాష్ట్రంలో ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారంట. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో ఎంపీలిద్దరూ తమతమ వాదనల్ని చంద్రబాబుకు వినిపించారు.
ఏదిఏమైనా ఈ పదవిని వదులుకోవాల్సిందేనని చంద్రబాబు వారికి స్పష్టం చేశారని తెలుస్తోంది. పార్లమెంటు సభ్యులు పార్లమెంటులోను, ఢిల్లీలోనూ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, మరోవైపు నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు మరింత దగ్గరయ్యే చర్యలు చేపట్టాలని సూచించారట.
ఎంపీలంతా వారివారి పనులకే పూర్తి సమయాన్ని కేటాయించాలని, రాష్ట్రానికి నిధులు రాబట్టాలని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ పదవిని వదులుకోవాల్సిందేనని ఆదేశించారు. ఇందుకు వారిద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications