మోడీ ప్రభుత్వం వేధిస్తోంది: బాబు, ప్రధాని పదవిపై రాహుల్కు ఝలక్, ప్రశంసించిన దేవేగౌడ
Recommended Video
బెంగళూరు: బీజేపీయేతర కూటములు అన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని దేవేగౌడలు గురువారం అన్నారు. తాను దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసానని ఏపీ సీఎం చెప్పారు.
బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
చంద్రబాబు బెంగళూరులో కర్ణాటక సీఎం కుమారస్వామి, దేవేగౌడ తదితరులతో సమావేశమయ్యారు. పద్మనాభనగర్లోని దేవేగౌడ నివాసంలో సమావేశమయ్యారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ముగ్గురు నేతలు కలిసి మీడియాతో మాట్లాడారు.
బీజేపీ ప్రభుత్వం వేధిస్తోంది
కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. సీబీఐ, ఆర్బీఐ వంటి స్వతంత్ర సంస్థలను బీజేపీ హరించి వేసిందని ధ్వజమెత్తారు. కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని చాలా రాష్ట్రాలలోని ప్రతిపక్ష నేతలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. అన్ని రాజ్యాంగబద్ద సంస్థలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు.
మీడియా స్వేచ్ఛను హరించారు
స్వేచ్ఛగా వ్యవహరించాల్సిన మీడియా కూడా ఈ ప్రభుత్వం హయాంలో భయపడాల్సిన పరిస్థితిలో ఉందని చెప్పారు. మీడియా ఎప్పుడూ అధికార పార్టీకి కొమ్ము కాస్తుందని, ఇప్పుడు అలా లేదన్నారు. మీడియా అభద్రతా భావంలో ఉందని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చంద్రబాబు అన్నారు. దేశం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీయేతర పార్టీలు ఏకం కావాలన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారనే నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి ఆశగా ఎదురు చూశామని చెప్పారు. కూటమి ఏర్పాటు కోసం ప్రాథమికంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
2019లో మూడో కూటమి అధికారంలోకి వస్తుంది
2019లో మూడో కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే మాయావతి, అఖిలేష్ యాదవ్లతో చర్చించానని చెప్పారు. రేపు (శుక్రవారం) డీఎంకే అధినేత స్టాలిన్తో చర్చిస్తానని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కలిసి పని చేస్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడాలంటే దేవేగౌడ లాంటి నేత సహకారం అవసరమని చెప్పారు.
ప్రధాని ఎవరన్నది మేం నిర్ణయిస్తాం
నోట్ల రద్దు జరిగి ఇప్పటికీ రెండేళ్లయిందని, ఇప్పటికీ నోట్ల రద్దు కష్టాలు తీరలేదని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరన్నది మేం తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. తద్వారా 2019లో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా పూర్తిగా వారు నిర్ణయానికి రాలేదని అర్థమవుతోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి షాకని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఆ పార్టీతో కలిసి పని చేస్తామన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు.
చంద్రబాబుపై దేవేగౌడ ప్రసంసలు
బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని దేవేగౌడ చెప్పారు. లౌకికవాద పార్టీలు అన్నీ ఒక్కతాటి పైకి రావాలన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ ప్రభుత్వం శక్తీహీనం చేస్తోందన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మరిన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. సెక్యులర్ పార్టీలను ఏకతాటి పైకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే బాధ్యతను చంద్రబాబు తీసుకోవడం హర్షణీయమన్నారు.
గద్దె దించేందుకు ఈ ప్రయత్నం సఫలమవుతుంది
నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఈ ప్రయత్నం సఫలం అవుతుందని భావిస్తున్నానని దేవేగౌడ చెప్పారు. గత నాలుగేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలన్నారు. బీజేపీయేతర కూటమి కోసం కాంగ్రెస్ పార్టీ కూడా తమతో చేతులు కలుపుతుందని చెప్పారు.