నాపై ఎంత కక్షో! భయపడేది లేదు: జగన్ సర్కారుపై చంద్రబాబు నిప్పులు
అమరావతి: తెలుగుదేశం పార్టీతోపాటు తనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో చెప్పడానికి కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ మరో ఉదాహరణ అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 9 నెలల్లో మూడు సిట్లు.. ఐదారు కమిటీలు వేసి టీడీపీ కాదు.. మొత్తం ఏపీని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు.
నా మీద ఎంత కక్ష ఉందో..
‘ఈ(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) ప్రభుత్వానికి నా మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి మా ఐదేళ్ళ పాలన మీద నిన్న వేసిన సిట్ మరో ఉదాహరణ. ఇదేమీ కొత్తకాదు. 9 నెలల్లో 3 సిట్ లు, అయిదారు కమిటీలు వేసి తెలుగుదేశం పార్టీని కాదు. ఏకంగా ఏపీనే టార్గెట్ చేసారు. భావితరాలకు తీరని నష్టం చేసారు' అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

అది తప్ప ఏం సాధించారు?
‘అధికారంలోకి వస్తూనే తవ్వండి, తవ్వండి అన్నారు. తవ్వితే సన్మానాలు చేస్తాం, అవార్డులు ఇస్తాం... ప్లీజ్ అంటూ అధికారులను బతిమిలాడుకున్నారు. 8 నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేశారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారు?' అని చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కారును ప్రశ్నించారు.

కక్ష సాధింపు తప్ప.. ఒరిగిందేంటి?
‘ఇప్పుడీ జీవో 344 వైసిపి వేధింపులకు పరాకాష్ట. గత 5ఏళ్ల నిర్ణయాలపై మీరు సిట్ వేశారు. మీ 5ఏళ్ల పాలనపై రేపు రాబోయే ప్రభుత్వం సిట్ వేస్తుంది. కక్ష సాధించుకోవడం తప్ప, వీటివల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి?' అని చంద్రబాబు నాయుడు జగన్ సర్కారును నిలదీశారు.

అప్పుడు వైఎస్.. ఇప్పడూ అంతే..
‘వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నా మీద 26 విచారణలు(14 సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4 న్యాయ విచారణలు, అధికారులతో 4 విచారణలు, 1 సిబిసిఐడి ఎంక్వైరీ..) చేయించారు. ఏమైంది? ఇదీ అంతే! రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి, పాలనా యంత్రాంగాన్ని డీమొరలైజ్ చేయడమే వైసీపీ లక్ష్యం' అని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు.

భయపడేది లేదు...
‘సిట్నే పోలీస్ స్టేషన్గా పరిగణిస్తాం అనడం... తాము చెప్పింది చేయని అధికారులను బెదిరించడం, వేధించడం కోసమే. టిడిపి నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా. తెలుగుదేశం పార్టీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదు' అని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications