వైసీపీ పాలనలో ఊరికో ఉన్మాది! లేని రోడ్డులో అక్రమాలంటూ నాపై కేసులు: చంద్రబాబు నిప్పులు
చిత్తూరు: రాష్ట్రంలో దొంగల రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. త్రీకేర్ ప్రాజెక్ట్ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, రైతులకు రుణాలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ సీఎం జగన్ అరాచకానికి తెరలేపారని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఏపీ.. శ్రీలంక కావడానికి ఎంతో సమయం పట్టదన్న చంద్రబాబు
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి సీఎంని చూడలేదన్నారు చంద్రబాబు. మోటర్లకు మీటర్లు బిగిస్తే రైతు పరిస్థితి అగమ్యగోచరమేనని తెలిపారు. ప్రజల కోసం ఎలాంటి కేసులనైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఏపీ మరో శ్రీలంక కావడానికి ఎంతో సమయం పట్టదన్నారు. ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. ప్రభుత్వంపై తీవ్రస్థాయలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
లేని రోడ్డులో అక్రమాలంటూ నాపై కేసులు పెట్టారు: చంద్రబాబు
అమరావతిలో రింగ్ రోడ్డే లేకుండా అక్రమాలకు పాల్పడ్డారని తనపై కేసు ఎలా పెడతారని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే జగన్ జీవితాంతం జైలు పాలవ్వాల్సి వస్తోందని చంద్రబాబు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకే మాజీమంత్రి నారాయణను అరెస్టు చేశారన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి వ్యవస్థలను నాశనం చేశారని ధ్వజమెత్తారు.
రాజకీయ కక్షతోనే నారాయణను అరెస్ట్ చేశారన్న చంద్రబాబు
నారాయణ, చైతన్య సంస్థల ద్వారా మంచి చదువు అందుతోంది. నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలను ప్రోత్సహించాలి. విద్యా సంస్థల బాధ్యతల నుంచి నారాయణ తప్పుకున్నారు. రాజకీయ కక్షతోనే మాజీమంత్రి నారాయణ అరెస్టు చేశారు. 43 ఏళ్లు కష్టపడి విద్యాసంస్థలను నారాయణ నిర్మించారు. అమరావతిలో రింగ్రోడ్డే లేకపోతే నాపై కేసు ఎలా పెడతారు ?. సాగుకు మీటర్లు పెడితే అదే వైసీపీ చివరి తప్పు అవుతోంది అని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఊరికో ఉన్మాది తయారవుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో దొంగలు యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చి దోచుకుంటున్నారు.
డబ్బుల సంచులతోనే ఎన్నికలంటూ చంద్రబాబు ఫైర్
డబ్బుల సంచులతో కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఆడపిల్లలపైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తానికి రాష్ట్రం నుంచే గంజాయి సరఫరా అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. తన జీవితంలో సొంతానికి ఏమీ చేసుకోలేదని.., నిబద్ధతతో తన పని చేసుకుంటా వెళ్లానన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు అన్ని ఇబ్బందులు, సమస్యలతోనే జీవితం గడుపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కాగా, మూడ్రోజుల పర్యటన నిమిత్తం సాయంత్రం కుప్పం చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ముందుగా బెళ్లకోగిలో చంద్రబాబు అరటిపంటను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.