జగన్కు అది తోడైతే, అసలే కోతి.. అది తాగితే: చంద్రబాబు వ్యాఖ్య
తిరుపతి: మహానాడు ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. జగన్ది నేరస్తుడి మెదడు అని వ్యాఖ్యానించారు. కోతితో పోల్చి చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ...
నాడు కాపులకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేదో చెప్పాలన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారన్నారు. తాము కాపులకు వెయ్యి కోట్ల రూపాయల నిధులు, రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. తాము అభివృద్ధి చేస్తే తమ పార్టీ ఉండదని విపక్షాలు భావిస్తున్నాయన్నారు.
మనం ఏపీ అభివృద్ధి కోసం పని చేస్తుంటే నేర చరిత్ర కలిగిన పార్టీ మనల్ని విమర్శిస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదన్నారు. రాయలసీమ ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేదని, కాంగ్రెస్ పార్టీ దానిని ముఠాలుగా మార్చివేసిందని, మేం సీమను రతనాలసీమ చేస్తామన్నారు.
కాపు రిజర్వేషన్లు అడగడంలో ఎలాంటి తప్పులేదని, కానీ మీటింగ్ పేరుతో రైలును కాల్చడం, పోలీస్ స్టేషన్లలో దాడులు చేయడం ఏమిటన్నారు. ఇది ఎవరు చేశారని నేను ముద్రగడ పద్మనాభంను అడుగుతున్నానని ప్రశ్నించారు. ఎవరు చేశారో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
ఖబడ్దార్.. జగన్ను కోతితో పోల్చిన బాబు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశాలతోనే కొందరు తుని ఘటనకు కారణమని చెప్పారు. నేరస్తుల మెదడు ఎప్పుడు నేరాల వైపే ఉంటుందన్నారు. దానికి రాజకీయం, ఇంకా దానికి ప్రతిపక్ష హోదా తోడు అయితే ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు.
ఓ కోతి ఉండి, అది తాగితే దాని పరిస్థితి ఎలా ఉంటుందే, నేరమయమైన వైసిపికి రాజకీయం, దానికి ప్రతిపక్ష హోదా తోడయితే ఎలా ఉంటుందే అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలను కాపాడలేకపోతే నాకు ఈ అధికారం కూడా అవసరం లేదన్నారు.
ప్రజలను భయాందోళనకు గురి చేస్తే ఖబడ్దార్ అని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేరస్తులు ఉండేందుకు అర్హత లేదన్నారు. వాళ్ల చరిత్ర మనుషులను చంపడం, భయపెట్టడం అన్నారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలు రిజర్వేషన్లు అడుగుతున్నారని చెప్పారు. అందుకే తాను ఆలోచించాని, అగ్రవర్ణాల్లోని పేదలకు కొంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చే దిశలో ఆలోచిస్తున్నామని చెప్పారు.