ఆ విషయంలో తేల్చుకోలేని డైలామాలో బాబు... తెలుగు తమ్ముళ్ల భిన్నాభిప్రాయాలు..
మంగళవారం(జూన్ 15) నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమావేశాలకు టీడీపీ హాజరవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై చర్చించేందుకు సోమవారం ఆన్లైన్ ద్వారా టీడీఎల్పీ సమావేశమైంది. అయితే సమావేశంలో నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది సమావేశాలకు దూరంగా ఉందామని సూచించగా... మరికొందరు సమావేశాలకు వెళ్దామని అంటున్నారు. దీంతో అధినేత చంద్రబాబు దీనిపై డైలామాలో పడ్డారు. సుదీర్ఘంగా సాగుతున్న టీడీఎల్పీ సమావేశంలో చివరకు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.
టీడీపీ నేతల భిన్నాభిప్రాయాలు..
తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు,మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి,ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల అరెస్టులను నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉందామని కొంతమంది టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడుకి సూచించారు. అసెంబ్లీకి వెళ్లినా మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు వెళ్లి వృథా అని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొందరు నేతలు మాత్రం సమావేశాలకు హాజరుకావాల్సిందేనని అంటున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం,బడ్జెట్ ఆమోద తీర్మానంపై మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి.. ఆ సమయంలో టీడీపీ నేతల అరెస్టులను నిరసించే అవకాశం దొరుకుతుందని చెబుతున్నారు. కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకోవద్దని,సభా వేదికగా ప్రజలకు మన అభిప్రాయాలను చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
డైలామాలో బాబు..
టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న భిన్నాభిప్రాయాలతో చంద్రబాబు డైలామాలో పడ్డట్టు తెలుస్తోంది. గతంలో పార్టీ ఫిరాయించిన వైసీపీ నేతలకు టీడీపీ మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. జగన్ లాగా తాము కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనని చంద్రబాబు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. రేపటి నుంచే సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సాయంత్రానికి దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కచ్చితంగా వ్యూహాత్మక వైఖరితోనే ముందుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు.
సమావేశాలు 2 రోజులకు కుదింపు..?
ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం కేవలం 16,17 రెండు రోజులకే కుదించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బడ్జెట్,బిల్లులు త్వరత్వరగా ఆమోదింపజేసుకోవడమే లక్ష్యంగా బీఏసీలో కార్యాచరణను రూపొందించనుంది. మొదటిరోజు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్ నుంచే ఆన్లైన్ ద్వారా ప్రసంగం చేయనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఏసీ సమావేశమై సభా కార్యక్రమాలపై చర్చిస్తుంది.
ఆ తర్వాత గంట సేపటికే ఉభయ సభల సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఆ వెంటనే ధన్యవాద తీర్మానాన్ని త్వరగా ముగించి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆపై దానిపై చర్చ,ఆమోదం చకచకా జరిగేలా చూడాలని వైసీపీ భావిస్తోంది. మరుసటిరోజు బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు రోజుల్లో ఇదంతా పూర్తి చేయాలని భావిస్తోంది.