కీలక శాఖలు అట్టిపెట్టుకున్న బాబు, కెసిఆర్ అసహనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలను కేటాయించడంలోను ముందుచూపుతో వ్యవహరించారంటున్నారు. పలు శాఖలను మంత్రులకు కేటాయించిన ఆయన కీలక శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు.
ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విద్యుత్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. ఇవి కాక న్యాయ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలను కూడా ఎవరికీ కేటాయించలేదు.
మంత్రులకు బంగళాల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు బంగళాలు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. డిప్యూటీ సీఎంలలో ఒకరైన చినరాజప్ప (ఎంబి-30)తోపాటు మంత్రులు అచ్చెన్నాయుడు (ఎంబి-28), పి మాణిక్యాలరావు (ఎంబి-27), పరిటాల సునీత (ఎంబి-25)లకు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని మంత్రుల నివాసాల్లో వసతి కల్పించింది.
అలాగే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏగా ఉన్న ఆయనకు జూన్ 1న సీఎస్గా అదనపు బాధ్యతలను అప్పగించింది. చంద్రబాబు తాజా ఉత్తర్వులో ఆయనను పూర్తిస్థాయి సీఎస్గా నియమించారు.
నెంబర్ ప్లేట్లపై కెసిఆర్
తెలంగాణలో వాహనాల పాత రిజిస్ట్రేషన్ నంబర్లను మార్చాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. AP స్థానంలో TS మార్చుకుంటే సరిపోతుందన్నారు. నంబర్లు పాతవే ఉంటాయని, జిల్లా కోడ్లు మాత్రం మార్చుకోవాలన్నారు. ఫ్యాన్సీ నెంబర్లు గల వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ రోజు ఆయన రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నెంబర్ ప్లేట్ల విషయంలో ప్రజల్లో గందరగోళం సృష్టించారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.