కేంద్రం ఏమిస్తోంది?, ప్యాకేజీ ఇస్తే ఎంత అదనం!: దృష్టి సారించిన చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు హోదాకు బదులు కేంద్రం భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా లేక ప్యాకేజీనా? ప్యాకేజీ ఇస్తే ఎంత అదనంగా వస్తుంది? అన్న లెక్కల్లో మునిగిపోయారు.
అయితే కేంద్రం మాత్రం ఇప్పటికే ఏపీకి చాలా ఇస్తున్నామని, ప్యాకేజీ రూపంలో హోదా కన్నా ఎక్కువ నిధులు ఇస్తామని చెబుతోన్న నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు తీరును చంద్రబాబు తెలుసుకుంటున్నారు. కేంద్ర పథకాల్లో తమవాటా పెంచడం వల్ల తమపై అదనపు భారం పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది.

వాస్తవంగా కేంద్ర పథకాల వల్ల రాష్ట్రానికి చేకూరుతున్న ప్రయోజనమెంత? అనే అంశంపై అధ్యయనం ప్రారంభమైంది. ఆర్థిక సలహాదారు, ప్రముఖ కాస్ట్ అకౌంటెంట్ కె.నరసింహమూర్తికి ఈ బాధ్యతను అప్పగించారు. ఏపీలో కేంద్ర పథకాలు ఏమేం అమలవుతున్నాయి? ఆయా పథకాలకు మొత్తంగా ఏమేరకు నిధులు కేటాయించారు?
అందులో ఏపీ వాటా ఎంత? కేంద్రం వాటా కింద ఎంతమేరకు నిధులు రావాలి? విడుదలైన మొత్తం ఎంత? వంటి వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన 'రూసా' పథకంపై నరసింహమూర్తి ఇప్పటికే ఓ నివేదికను సిద్ధం చేశారు.
దీనిపై ఆయనో ప్రెజెంటేషన్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించారు. అదే తరహాలో అన్ని సెక్టార్లకు, శాఖలకు సంబంధించిన కేంద్ర పథకాలపైనా అధ్యయనం జరపాలని ప్రభుత్వం నరసింహమూర్తికి సూచించారు. ఇక 'రూసా' పథకం విషయానికి వస్తే ఉన్నత విద్య మెరుగుదల ప్రధాన లక్ష్యంగా 2013లో ప్రారంభమైన కేంద్ర ప్రాయోజిత పథకం.
ఈ పథకం ప్రారంభమైనప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామి అయింది. ప్రస్తుతం స్వయంప్రతిపత్తి ఉన్న కళాశాలల స్థాయి పెంచి యూనివర్సిటీలను స్థాపించడం, యూనివర్సిటీలు - కళాశాలలకు మౌలిక సదుపాయాల గ్రాంట్లు, రీసెర్చ్, ఇన్నోవేషన్, నాణ్యత మెరుగుదల వంటి అనేక అంశాలు ఈ పథకంలో భాగంగా ఉన్నాయి.
మిగిలిన కేంద్ర ప్రాయోజిత పథకాల తరహాలోనే ఈ పథకంలోనూ కేంద్ర- రాష్ట్ర వాటాలు 60:40గా ఉంటాయి. ఈ పథకంలోని అన్ని లక్ష్యాలకూ కలిపి కేటాయింపులు రూ.22,855 కోట్లుగా (2022వరకు) పేర్కొన్నారు. గత రెండేళ్ల (2014-15, 2015-16ల)లో రాషా్ట్రనికి రూ.357.43 కోట్లు కేటాయించారు.
ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.50.96 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్ర వాటాను కూడా కలిపితే రెండేళ్లలో ఈ పథకం కింద రాష్ట్రానికి రూ.82.59 కోట్లు విడుదలయ్యాయి. కేంద్ర కేటాయింపులు తక్కువ ఉన్న విషయం రూసాపై నివేదికతో స్పష్టమైంది. 2020 నాటికి దేశవ్యాప్తంగా రూ. 22,855 కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్దేశించుకుంది. అందులో కనీసం రూ.1500 కోట్లు ఏపీకి తెచ్చుకోవచ్చని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications