టోక్యోకు విమానం: జపాన్ ఇన్వెస్టర్లతో బాబు, హైద్రాబాద్లా వద్దని కాళ్లు మొక్కారు!
విజయవాడ: భవిష్యత్తులో ఏపీ రాజధాని అమరావతి నుంచి టోక్యోకు విమానాలు ఉంటాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నాడు జపాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
78 మంది జపాన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతి నుంచి జపాన్ రాజధాని టోక్యోకు విమానాలు నడుస్తాయన్నారు. జపాన్తో ఏపీకి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఏపీ నుంచే జపాన్, చైనాలకు బౌద్ధమతం వ్యాప్తి చెందిందని తెలిపారు. కాగా, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి.
ఏపీపై ప్రధాని మోడీ ప్రశంసలు
రెయిన్ గన్ టెక్నాలజీ, జలవనరుల వినియోగంపై ప్రధాని మోడీ ఏపీపై ప్రశంసలు కురిపించారని చంద్రబాబు అన్నారు. వాటిని స్ఫూర్తిగా తీసుకొని మరింత పని చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. విజయవాడలో నీరు - చెట్టు టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు అంతకుముందు మాట్లాడారు.
హైదరాబాద్ పరిస్థితి వద్దని కాళ్లు మొక్కారు
అనుమతి లేని హోర్డింగులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ పట్టణవాసులు ఉద్యమించారు. రెండు రోజుల క్రితం హైదరాబాదులో గాలికి విరిగిపడ్డ హోర్డింగులు, చెట్లను ప్రస్తావిస్తూ.. విశాఖలో సైతం అనుమతి లేని హోర్డింగులు లెక్కకు మించి ఉన్నాయన్నారు. వాటిని తొలగించాలని నిరసన తెలిపారు.
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) చైర్మన్ కాళ్లు మొక్కి మరీ ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. బాగా గాలివీస్తే, కూలిపోయేలా ఉన్న ప్రాణాంతక హోర్డింగులను తక్షణం తీసేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న వారు విజ్ఞప్తి చేయగా, కమిషనర్ ప్రవీణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు.