బీహార్తో పోల్చొద్దు, అంతకంటే ఎక్కువ.. రూ.2.25లక్షల కోట్లివ్వండి: బాబు
హైదరాబాద్: నవ్యాంధ్రప్రదేశ్కు రూ.2.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి తాను విజ్ఞప్తి చేసినట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం వెల్లడించారు. ఆయన తనను కలిసిన విలేకరులతో సాయంత్రం మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నీతి ఆయోగ్ ద్వారా అమలు చేయిస్తోందన్నారు. విభజన వల్ల ఏపీకి తీరని అన్యాయం జరిగిందని, దీనిని తొలగించేందుకు విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలనూ తూచ తప్పకుండా అమలు చేయాల్సిన అవసరముందన్నారు.
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. నీతి ఆయోగ్ రాష్ట్రాధికారులతో చర్చించిన అనంతరం విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు అనుసరించాల్సిన రోడ్ మ్యాప్ను తయారు చేస్తుందని, ఈ రోడ్ మ్యాప్ ప్రకారం కేంద్రం వాటిని అమలు చేస్తుందన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశం మేరకే నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ తయారు చేస్తోంది కాబట్టి నీతి ఆయోగ్ ఇచ్చే నివేదికను అమలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనని చెప్పారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలయ్యేందుకు వాటికి చట్టబద్దత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బీహార్ రాష్ట్రంతో ఏపీకి పోలిక వద్దని ప్రధాని మోడీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కాగా, స్కూల్ సిలబస్లో స్వచ్ఛ భారత్ చేర్చుతామని చెప్పారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలు రూ.90,910 కోట్లు. కాగా, రహదారులు, రైల్వేలు, విమాయానం, పోర్టులు, విద్యుత్, సాగునీరు, వ్యవసాయం, తాగునీరు, పట్టణ సర్వీసులు, అటవీ శాఖ, పర్యాటకం, ఆరోగ్యం, సామాజిక సాధికారతలకు ఏపీ సీఎం చంద్రబాబు రూ.2,25 లక్షల కోట్లు కోరారు.
మరోవైపు, చంద్రబాబు బుధవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఏపీ సమస్యల విషయమై చంద్రబాబు రాష్ట్రపతితో వివరించినట్లుగా తెలుస్తోంది. ఇరువురు దాదాపు అర్దగంట పాటు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు పలువురు ఎంపీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications