"ఎన్టీఆర్ హత్యకు గురై 21ఏళ్లు.. హంతకుడు ఆయన అల్లుడే!"
చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనపై హత్యారోపణలు చేశారు. మాజీ సీఎం ఎన్టీఆర్ ను ఆయన అల్లుడే హత్య చేశారని రఘువీరా ఆరోపించారు.
కాకినాడ: పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారన్న అపప్రద ఏపీ సీఎం చంద్రబాబును వెంటాడుతూనే ఉంది. సందర్భం వచ్చిన ప్రతీసారి ప్రతిపక్ష నాయకులు ఇదే అంశంపై ఆయన్ను టార్గెట్ చేస్తుంటారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనపై హత్యారోపణలు చేశారు. మాజీ సీఎం ఎన్టీఆర్ ను ఆయన అల్లుడే హత్య చేశారని రఘువీరా ఆరోపించారు. 'ఎన్టీఆర్ హత్యకు గురై 21సంవత్సరాలు అవుతోందని, ఆ పని చేసింది ఆయన అల్లుడేనని' అన్నారు. అప్పట్లో పదవుల కోసం ఔరంగజేబు సొంతవాళ్లను చంపడానికి కూడా వెనుకాడలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. చంద్రబాబు కూడా ఔరంగజేబు లాంటివారేనని ఆరోపించారు.
సోమవారం కాకినాడలో మీడియాతో మాట్లాడిన రఘువీరా ఈ ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని ఆరోపించారు. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఫైలు ప్రధాని టేబుల్ మీద ఉందని చెప్పడం పచ్చి అబద్దమన్నారు. ఇప్పటికీ ఎన్నిసార్లు టీడీపీ ఎన్టీఆర్ పేరును భారతరత్న కోసం సిఫారసు చేసిందని ప్రశ్నించారు. చిత్తశుద్దితో ప్రయత్నించారా? అని నిలదీశారు.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న సిఫారసు.. ప్రధాని టేబుల్ పై ఏంటే, ఇక తీర్మానం చేయాల్సిన అవసరమేముందని రఘువీరా ప్రశ్నించారు. అసలు ప్రధాని వద్ద ఉన్నది ఎన్టీఆర్ ఫైలా? లేక చంద్రబాబుకు భారతరత్న ఇవ్వాలన్న ఫైలా? అదీ కాకపోతే.. సుజనా బ్యాంకుల వ్యవహారానికి సంబంధించిన ఫైలా? అని నిలదీశారు. ఇంకా ఎన్నాళ్లిలా ఏపీ ప్రజలను మోసం చేస్తారని రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు.