‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై తొలిసారి స్పందించిన బాబు, ఏమన్నారంటే..?
అమరావతి: గత కొన్ని రోజులుగా వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఈ అంశంపై తొలిసారి స్పందించారు.
అతిగా స్పందించొద్దు..
మంగళవారం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. వర్మ తీయబోతున్న సినిమాపై అతిగా స్పందించవద్దని తెలుగుదేశం శ్రేణులకు సూచించారు. మహానేత ఎన్టీఆర్ కారణజన్ముడని అన్నారు. సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవను తెలుగుజాతి మరువదని అన్నారు.
గమనిస్తున్నారు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాంగోపాల్ వర్మను కలవడాన్ని తెలుగు ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వర్మ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి తీస్తున్న సినిమాపై ప్రజలకు ఓ అవగాహన కూడా ఉందని చంద్రబాబు తెలిపారు.
ఆ అవసరం లేదు..
వైసీపీ నేతలతో కలిసి వర్మ తీస్తున్న ఈ సినిమాపై టీడీపీ నేతలు, కార్యకర్తలు స్పందించాల్సిన అవసరం లేదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు.. వర్మతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.
నష్టం కలగకుండా..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని, కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి పోలవరం ప్రాజెక్టుకు ఉన్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎటువంటి బేషజాలు లేకుండా గడ్కరీ నాగ్పూర్లో ఉంటే అక్కడికి వెళ్తున్నానని, తాను విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చే లోపే పోలవరం అడ్డంకులు తొలగిపోతాయని సీఎం తెలిపారు. తుఫానులు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయానికి నష్టం కలగకుండా చూడాలని ఈ సందర్భంగా మంత్రులు, అధికారులను ఆదేశించారు.