ప్యాకేజీకి అందుకే ఒప్పుకున్నా! పార్టీ నేతలపై ఆగ్రహం-ఎంపీలకు ప్రశంస: తేల్చేసిన చంద్రబాబు
Recommended Video
అమరావతి: రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో తమ గళాన్ని గట్టిగా వినిపించిన ఎంపీలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశంసించారు. అలాగే పార్టీ నుంచి పదవులు పొంది సొంత ప్రయోజనాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న నేతలు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, మంత్రులతో గురువారం చంద్రబాబు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇకపై రోజూ పార్టీకి కొంత సమయం కేటాయిస్తానని చెప్పారు.
నిందిచ్చొద్దు కానీ.. న్యాయం జరగాల్సిందే
తెలుగుదేశం క్రమశిక్షణ కలిగిన పార్టీ అని గుర్తు చేసిన చంద్రబాబు.. అనవసరంగా ఎప్పుడూ ఒకరిని నిందించబోమన్నారు. నోట్ల రద్దు, ఇతరత్రా సమస్యలు తలెత్తినప్పుడు కేంద్రానికి అండగా నిలిచామన్నారు. రాష్ట్ర విభజన వల్ల చాలా నష్టపోయామని..., అందుకు తగ్గ న్యాయం జరగాల్సిందేనన్నారు.
నాకు భయమా? మన మేలు కోసమే పవన్, జగన్ మాత్రం..: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎంపీలపై ప్రశంసలు
పార్లమెంట్ సమావేశంలో పార్టీ ఎంపీలు బాగా పనిచేసి ఏపీ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లారని చంద్రబాబు ప్రశంసించారు. రానున్న రోజుల్లోనూ ఇదే పోరాటం కొనసాగించాలని సూచించారు. కేంద్రంతో మిత్రపక్షంగా కొనసాగుతోంది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పదవుల కోసం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
అందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నా..
పదవులకంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్న ఆయన..., వాజ్ పేయి హయాంలో తొమ్మిది కేంద్ర మంత్రి పదవులు ఇస్తామన్నా వెంటపడలేదని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు ప్యాకేజీ రూపంలో ఇస్తామంటేనే ఆనాడు ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పారు. ఈ విషయంపై నేతలంతా స్పష్టమైన వైఖరితో ఉండాలన్నారు.
మూల్యం చెల్లించుకుంటారంటూ పార్టీ నేతలపై..
ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ద్వారా పదవులు పొంది స్వప్రయోజనాలకే ఎక్కువ సమయం కేటాయించుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రులం అయిపోయాం ఇంకేమన్న భావన కొందరు నేతల్లో ఉందని, అది సరికాదని అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి బాగానే ఉన్నా.. నాయకత్వ లోపం కనిపిస్తోందన్నారు. పార్టీ పదవులు అనుభవిస్తూ సొంత పనులు చూసుకుంటామంటే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు స్పష్టం చేశారు.
పక్క రాష్ట్ర సీఎంతో మాట్లాడా
పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడని..., ఎన్ని సమస్యలు, అడ్డంకులు ఎదురైనా పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరంపై సుప్రీంకోర్డులో ఒడిశా దాఖలు చేసిన పిటిషన్పై పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు స్పందించారు. తాజా సమస్యను పూర్తిగా అధ్యయనం చేసి తగు రీతిలో పరీష్కరించుకుందామని అన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం సకాలంలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలవరంపై ఒడిశా ముఖ్యమంత్రితో తాను మాట్లాడానని, ఆయన కొంత సానుకూలంగానే స్పందించారని చంద్రబాబు అన్నారు.