ఆసక్తికరం: పార్లమెంట్ మెట్లకు నమస్కరించి సెంట్రల్ హాల్కు బాబు, కాంగ్రెస్-బీజేపీ మినహా..
Recommended Video
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంటలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ఆయన పార్లమెంటు సెంట్రల్ హాలుకు వెళ్లారు. తొలుత గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించి, ఆ తర్వాత పార్లమెంటు మెట్లకు నమస్కరించి లోనికి అడుగు పెట్టారు.
చంద్రబాబు తొలుత మెట్లను తాకినప్పుడు ఫోటో బాగా రాలేదట. దీంతో ఫోటో గ్రాఫర్ సరిగా రాలేదని చెప్పడంతో మరోసారి మెట్లను తాకుతూ ఫోజులు ఇచ్చారని తెలుస్తోంది.
పార్లమెంటు సెంట్రల్ హాలులో విపక్ష నేతలను కలవనున్నారు. ప్రత్యేక హోదా, సభలో అవిశ్వాసానికి మద్దతు కోరనున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్టు మినహా ఇతర నాయకులను ఆయన కలవనున్నారు. బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని చెప్పి, వారి సహకారం కోరనున్నారు. ప్రత్యేక హోదా, అవిశ్వాస తీర్మానం విషయంలో ఆయన ఏ మేరకు ఫలప్రదం అవుతారనేది ఆసక్తికరమే.
ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలను కూడా కలవనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఆయన సందిగ్ధంలో చిక్కుకున్నారని తెలుస్తోంది. అయితే అవిశ్వాసానికి మద్దతిచ్చింది కాబట్టి కాంగ్రెస్ నేతలను కలిస్తే తప్పేమీ లేదని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కూడా మద్దతిచ్చింది కాబట్టి ఆ పార్టీ నేతలను కూడా కలవాలని పార్టీ నేతలు బాబుకు సూచించారు. కాగా, ఆ తర్వాత టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ.. చంద్రబాబు కాంగ్రెస్, బీజేపీలను కలవరని చెప్పారు.
కాగా, అంతకుముందు రోజు సోమవారం సాయంత్రం ఉండవల్లిలోని ప్రజా దర్బార్ హాలులో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడమే లక్ష్యంగా తాను ఢిల్లీ పర్యటన అని, అంతే తప్ప రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచన, ఆసక్తి తనకు లేదన్నారు. గతంలో రెండుసార్లు ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం వచ్చినా తాను సున్నితంగా తిరస్కరించానన్నారు.
ఈ సందర్భంగా ఆయన వైసీపీపై మండిపడ్డారు. మంగళ, బుధవారాల్లో ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి సారిస్తానని, ఢిల్లీలోనే కాకుండా రాష్ట్రం యావత్తు తన పర్యటనపై అంచనాలు ఉన్నాయని, ఎన్నికలంటే భయంతో వైసీపీ పార్లమెంటు సమావేశాల చివరి రోజున రాజీనామాలు ప్రకటించిందన్నారు.
రాజకీయాలకు కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చూపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాకు విజ్ఞప్తి చేశారు.