బిజెపికి బాబు కౌంటర్: టిడిపిని ఏం చేయలేరు, ఉపఎన్నికల్లో తడాఖా చూపుతాం
అమరావతి: తెలుగుదేశం పార్టీని ఎవరూ కూడ ఏమీ చేయలేరని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధీమాను వ్యక్తం చేశారు. 2019 లో టిడిపి పని అయిపోతోందని బిజెపి నేతలు అంటున్నారని చంద్రబాబునాయుడు పరోక్షంగా బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహరావు వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు.
టిడిపి విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నాడు అమరావతిలోని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేశారు.
ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన తీసుకొన్న నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మహనాడు తదితర అంశాలపై పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు సూచనలు ఇచ్చారు.
టిడిపిని ఫినిష్ చేస్తారా?
2019 ఎన్నికల్లో టిడిపి పని అయిపోతోందని కొందరు బిజెపి నేతలు చేస్తున్న ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కౌంటరిచ్చారు. బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహరావుతో పాటు మరికొందరు నేతలు చేసిన వ్యాఖ్యలను బాబు ప్రస్తావించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత చుక్కలు చూపిస్తారని అంటున్నారు. ఏదో చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని బాబు బిజెపి నేతలకు సూచించారు. టిడిపిని ఎవరూ కూడ ఏమీ చేయలేరని బాబు చెప్పారు.
ఏపీకి అన్యాయం చేశారు
ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయమని 2014 ఎన్నికల ముందు తాము బిజెపితో పొత్తును పెట్టుకొన్న విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. ఏపీకి న్యాయం చేయకపోగా రాష్ట్రానికి బిజెపి నేతలు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ఏపీ రాష్ట్రం కూడ దేశంలో కూడ భాగమేననే విషయాన్ని బిజెపి నేతలు గుర్తుంచుకోవాలన్నారు. అంతేకాదు తమకు కూడ హక్కులుంటాయని ఆయన చెప్పారు.
ఏపీకి రూ. 1500 కోట్లు
ఏపీకి కాంగ్రెస్, బిజెపిలు అన్యాయం చేశాయని ఆయన చెప్పారు.ఏపీని అన్ని విధాలుగా ఆదుకొంటామని ప్రధానమంత్రి మోడీ హమీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ కంటే బ్రహ్మండమైన రాజధాని కడతామని చెప్పి సహయం చేయలేదన్నారు. సర్ధార్ వల్లభాయ్పటేల్ విగ్రహనికి రూ. 2500 కోట్లు, ఏపీకి రూ. 1500 కోట్లు ఇచ్చారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. కేంద్రం తమపై బురద చల్లేందుకు ప్రయత్నాలు చేసిందని బాబు విమర్శించారు.
మహనటి సినిమాపై ఆరా తీసిన బాబు
మహానటి సినిమా గురించి టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు. ఈ సినిమా బాగుందని తనకు సమాచారం వచ్చిందన్నారు. ఈ సినిమా గురించి మీకు ఏ రకమైన ఫీడ్బ్యాక్ వచ్చిందని చంద్రబాబునాయుడు టిడిపి నేతలను ప్రశ్నించారు. ఈ సినిమా సందేశాత్మకంగా ఉందని పలువురు టిడిపి నేతలు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొచ్చారు. బయోపిక్ లు బాగా తీస్తే అందరూ చూస్తారని బాబు అభిప్రాయపడ్డారు. ఇదతే సమయంలో ఎన్టీఆర్ బయోపిక్పై కూడ రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ మాట్లాడారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేవరకు మొదటి భాగం ఉంటుందని మురళీమోహన్ చెప్పారు. ఈ సినిమా స్క్రిప్ట్ తాను విన్నానని ఆయన చెప్పారు. అయితే జనవరి మాసం వరకు సినిమా విడుదల చేస్తే బాగుంటుందని మురళీమోహన్ చెప్పారు.
ఉపఎన్నికల్లో తడాఖా చూపుతాం
ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా వైసీపీ ఎంపీల రాజీనామాలను జూన్ రెండవ తేది తర్వాత ఆమోదించే అవకాశం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలు వస్తే తడాఖా చూపుతామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో గతంలో 25 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే 7 సీట్లను కైవసం చేసుకొన్న విషయాన్ని బాబు గుర్తు చేశారు. వైసీపీ, బిజెపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.కర్ణాటకలో ఆశోక్బాబుపై వైసీపీ వారే దాడి చేశారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ రవాణా, బెల్టుషాపులపై బాధ్యత నేతలదేనని బాబు హెచ్చరించారు.