ఏపీ బంద్పై చంద్రబాబు ఇలా, 'కేంద్రంపై ఇలాంటి ఆందోళన తొలిసారి'
Recommended Video
అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు గురువారం ఏపీ బందుకు పిలుపునిచ్చాయి. ఈ బందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. బందుపై సీఎం చంద్రబాబు స్పందించారు. బందు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రులు, అధికారులను ఆదేశించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్సులో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఎంపీలు పార్లమెంటులో పోరాడుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై మన పోరాటం ఏపీలో కాదని, ఢిల్లీలో ఉండాలన్నారు.
బాబు ఆగ్రహం ఎఫెక్ట్: సుజన ఇంట్లో కీలక భేటీ, సస్పెన్షన్కు రెడీ, రాజ్ను కలవనున్న వైసీపీ
చిన్న పిల్లలను చూసుకున్నట్లే
ఏపీ బందుకు పిలుపునివ్వడంపై మంత్రులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద బాబు స్పందించారు. పోరాటం న్యాయమైనదేనని, కానీ ఈ అంశంపై పార్లమెంటులో తమతో కలిసి రావాలని అన్నారు. నవ్యాంధ్ర మూడున్నరేళ్ల చంటిబిడ్డ అని, చిన్న పిల్లలను ఎలా చూసుకుంటారో ఈ రాష్ట్రాన్ని అలా చూసుకోవాలన్నారు.
చంద్రబాబు ప్రత్యేక దృష్టి
రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రులు చెప్పారు. ప్రపంచం అంతా మనవైపు చూస్తున్న తరుణంలో ఈ ప్రతిష్టను ఇంకా పెంచుకోవాలన్నారు. విభజన చట్టంలోని హామీలను ఒక పద్ధతి ప్రకారం సాధించుకోవాలన్నారు. ఎన్డీయేలో తాము భాగస్వాములం అయినప్పటికీ రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని, కేంద్రమంత్రులను కలుస్తూ నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు.
ఢిల్లీలో పోరాడాలి
హామీల అమలు విషయంలో కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగింది వాస్తవమే అని మంత్రులు అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడంలో జాతీయస్థాయిలో టీడీపీ ఎంపీలు విజయం సాధించారన్నారు. నష్టాల్లో ఉన్న ఏపీలో బంద్ చేస్తే మనకే నష్టమన్నారు. వామపక్షాలకు ఇక్కడ శాసన సభలో ప్రాతినిథ్యం లేకపోయినా పార్లమెంటులో వారి సభ్యులు ఉన్నందున కేంద్రంపై ఢిల్లీలో పోరాడాలన్నారు.
కేంద్రంపై ఇలాంటి ఆందోళన మొదటిసారి
ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని మంత్రులు స్పష్టం చేశారు. మిత్రపక్షంగా ఉంటూ కేంద్రంపై ఇలాంటి ఆందోళన చేయడం దేశంలో తాము మొదటిసారి చూస్తున్నానని మంత్రులు చెప్పారు. ఢిల్లీలో తమ ఎంపీలతో కలిసి ఆందోళనకు మద్దతు తెలపాలన్నారు.
వెనుకడుగు లేదు
ఎక్కడ అన్యాయం జరిగిందో అదే పార్లమెంటులో జాతీయస్థాయిలో ప్రతిబింభించేవిధంగా ఆందోళన చేపట్టాలని మంత్రులు అన్నారు. ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. హామీలు అడగటం ఏపీ హక్కు అని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రాన్ని విడదీసిన పార్టీలకు బాధ్యత ఉందని చెప్పారు. ఎన్డీయోలో భాగస్వామిగా ఉన్నా ఆందోళనలపై వెనుకడుగు లేదన్నారు.