జగన్కు చెక్ చెబుదాం: అమిత్ షా ద్వారా మోడీ వద్దకు బాబు రాయబారం!
కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కుటుంబానికి రాజకీయంగా షాకిచ్చిన ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 2019లోను గెలుపు సాధించే దిశలో పావులు కదుపుతున్నారు.
అమరావతి: కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కుటుంబానికి రాజకీయంగా షాకిచ్చిన ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 2019లోను గెలుపు సాధించే దిశలో పావులు కదుపుతున్నారు. ఏం జరిగినా మళ్లీ టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారు.
అందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అంశాలను ఆయన ఉపయోగించుకుంటున్నారు. మరోసారి గెలుపు కోసం అందుబాటులో ఉన్న ప్రతి దానిని ఉపయోగించుకుంటున్నారు.
పార్టీ ఫిరాయింపులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను దూరం చేసుకోకుండా ఉండటం, 2019 టార్గెట్గా ప్రతిపక్షాలకు చెక్ చెప్పేందుకు కేబినెట్ విస్తరణ.. ఇలా అన్నింటా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

బీజేపీతో ఉండటం వెనుక డబుల్ ప్లాన్
ఇందులో భాగంగానే బీజేపీని కూడా దూరం చేసుకోదల్చుకోలేదు. బీజేపీని దూరం చేసుకోవద్దనుకోవడం వెనుక రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఆ పార్టీతో ఉండం వల్ల 2019లోను తమకు మోడీ హవా కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.
అలాగే, విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుకునే అవకాశం దక్కుతుంది. తద్వారా ఏపీకి ప్రయోజనం. కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే కొత్త రాష్ట్రమైన ఏపీ రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ఈ కారణంగానే చంద్రబాబు బీజేపీని దూరం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ విషయాన్ని ఆయన కూడా స్వయంగా చెప్పారు.

పవన్ నుంచి ఫిరాయింపుదాకా..
2014 ఎన్నికల్లో బీజేపీతో కలవడంతో పాటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా టిడిపికి కలిసి వచ్చింది. ఈ కారణంగా కాపు మద్దతు కూడా లభించింది. 2019లోను పవన్ మద్దతు ఉంటే ఆ వర్గం ఓట్లతో పాటు యువత తమ వైపు ఉంటుందని టిడిపి భావిస్తోంది.
ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ ఏ సమస్య పైన నిలదీసినా సానుకూలంగా స్పందిస్తోంది. 2019లోపు అన్ని జిల్లాల్లో మరింత బలోపేతం కావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఫిరాయింపులను కూడా ప్రోత్సహిస్తోంది.

నియోజకవర్గాల పెంపు
టార్గెట్ 2019 పెట్టుకున్న చంద్రబాబు అందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇందులో భాగంగా ఆయన మదిలో ఉన్న మరో ఆలోచన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ. దీనిపై చంద్రబాబు దృష్టి పడింది. 175 నియోజకవర్గాలుగా ఉన్న ఏపీని 225 నియోజకవర్గాలకు పెంచడం ద్వారా కూడా టిడిపి గెలుపును మెరుగుపరచవచ్చునని భావిస్తున్నారు.

అమిత్ షాతో చర్చలు
ఏపీలో నియోజకకవర్గాల పెంపు ద్వారా టిడిపి - బిజెపి 2019లోను అధికారంలోకి వస్తుందని, ఎక్కువ సీట్లు సాధిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చెవిన వేశారు.

అమిత్ షాకు హామీ
ఇటీవల ఎన్డీయే పార్టీల సమావేశానికి చంద్రబాబు ఢిల్లీలో హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు.. అమిత్ షాను కలిసి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేశారు. 2019లోను టిడిపి.. ఎన్డీయేలోనే ఉంటుందని అమిత్ షాకు చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.
2019లో ప్రతిపక్షాలను, ముఖ్యంగా వైసిపిని అడ్డుకోవాలంటే టిడిపి - బిజెపి కలిసి పోటీ చేయాలని, ఇందుకోసం అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా పెంచాలని అమిత్ షాను కోరారని తెలుస్తోంది. సీట్ల పెంపుతో వైసిపిని మరింత ధీటుగా అడ్డుకోవచ్చని చంద్రబాబు చెప్పడంతో.... అమిత్ షా కూడా ఈ విషయాన్ని ప్రధాని మోడీతో మాట్లాడుతానని చెప్పారని తెలుస్తోంది.

అందరినీ సంతృప్తి పరచాలంటే..
ఇప్పటికే పలువురు కీలక నేతలు, ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారు. 2019 నాటికి ఇవే సీట్లు ఉంటే టిడిపిలో అసంతృప్తుల జాబితా చాంతాడంత అవుతుంది. అసెంబ్లీ స్థానాలు పెంచితే.. టిక్కెట్లు ఇవ్వడం సులభం అవడమే కాకుండా.. దాదాపు తమకు అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేసుకునే వెసులుబాటు ఉంటుందని అంటున్నారు. అలా జగన్కు చెక్ చెప్పవచ్చునని భావిస్తున్నారు. ఇందు కోసం అమిత్ షా ద్వారా ప్రధాని మోడీ వద్దకు చంద్రబాబు రాయబారం నడిపిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications