వైసీపీలోకి ఆమంచి, రంగంలోకి దిగిన చంద్రబాబు!: ఫలించని మంత్రి బుజ్జగింపులు
చీరాల: ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత శిద్ధా రాఘవ రావు మంగళవారం చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి ఆ తర్వాత టీడీపీతో అనుబంధంగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైయస్సార్ కాంగ్రెస్, జనసేన వైపు చూస్తున్నారు. ఆ రెండు పార్టీల నేతలు ఆమంచితో టచ్లో కూడా ఉన్నారు.
వారిని మార్చుతారా?: జగన్ సీఎం కావాలి... కానీ వాళ్లు వద్దు, వైసీపీకి కొత్త చిక్కు!
చంద్రబాబు మాటగా చెబుతున్నా
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. వెంటనే మంత్రి శిద్ధాను ఆయన వద్దకు పంపించారు. టీడీపీలోనే కొనసాగాలని శిద్ధా.. ఆమంచికి సూచించారు. చంద్రబాబు మాటగా దీనిని చెబుతున్నానని అన్నారు. ఓ వైపు తన వర్గీయులతో ఆమంచి సమావేశమవుతూనే, శిద్ధాతో చర్చలు జరిపారు.
టీడీపీలోనే కొనసాగండి
ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామాలు బాగుండదని, టీడీపీలోనే కొనసాగాలని శిద్ధా.. ఆమంచిని కోరారు. ఈ సందర్భంగా పార్టీలో తనకు ఎదురైన అనుభవాలను ఆమంచి వివరించారు. దీంతో మీకు న్యాయం చేస్తామని చెప్పడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుతోను ఫోన్లో మాట్లాడించారని తెలుస్తోంది. కానీ ఆమంచి మాత్రం పార్టీ మారేందుకే ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.
జనసేనలోకా, వైసీపీలోకా?
అయితే శిద్ధా రాఘవ రావుతో చర్చల అనంతరం కూడా ఆమంచిలో మార్పు కనిపించలేదని తెలుస్తోంది. ఆయన అనుచరులతో సమావేశం రాత్రి వరకు కొనసాగించారు. టీడీపీలో కొనసాగటం ఆమంచికి ఆసక్తి లేనట్లుగా కనిపిస్తోంది. ఆయన ప్రధానంగా వైసీపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. జనసేనలోను చేరే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు.