అప్పుడే సంకేతాలు?.. సీబీఐ విచారణ దిశగా కేంద్రం: టెలికాన్ఫరెన్స్లో బాబు
Recommended Video

అమరావతి: తెలుగుదేశం పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే హోదాపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ.. ఇప్పుడు దర్యాప్తు సంస్థల విచారణకు సన్నద్దం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం సీబీఐ విచారణ దిశగా అడుగులు వేస్తున్నట్టు సీఎం చంద్రబాబుకు సంకేతాలు అందాయి.

టెలికాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు:
కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. సీఎం చంద్రబాబు ప్రతీరోజు టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం తమ పైన కక్ష సాధింపుకు సిద్దమైందని, త్వరలోనే సీబీఐ విచారణకు ఆదేశించవచ్చునని ఎంపీలతో చంద్రబాబు చెప్పారు.

సీబీఐ విచారణకు అవకాశం..:
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశం అవకాశం ఉందని చంద్రబాబు పార్టీ ఎంపీలతో పేర్కొన్నారు. కాబట్టి పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తనతో పాటు, లోకేష్ను, మంత్రులను కేంద్రం టార్గెట్ చేసిందని ఆయన వాపోయారు.

ఇలా ఎదుర్కొందాం..: చంద్రబాబు
రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడు పార్టీలు కలిసి ముప్పేట దాడి మొదలుపెట్టాయని చంద్రబాబు అన్నారు. కుట్రలను ఎదుర్కొనేందుకు టీడీపీ నేతలు సిద్దంగా ఉండాలని తెలిపారు.
సీబీఐ విచారణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను కుట్రలో భాగంగానే జనాల్లోకి తీసుకెళ్లాలని, వైసీపీ, జనసేనలు కూడా అందులో భాగమేనని ప్రజలకు వివరించాలని సూచించారు. తద్వారా ప్రజలకు టీడీపీ పట్ల నమ్మకం సడలకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు.

పట్టిసీమ, పోలవరంపై..:
పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలపై కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మంత్రి లోకేష్ పై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన్ను కూడా కేంద్రం టార్గెట్ చేయవచ్చునని అంటున్నారు.
సీబీఐ విచారణకు పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడం.. బీజేపీ దాన్ని సమర్థించడం.. అప్పుడే విచారణ దిశగా అడుగులు పడటం ఇలా చకచకా అన్నీ జరిగిపోతున్నాయి. వీలైనంత త్వరగా టీడీపీని తీవ్ర ఇరకాటంలో పడేసేందుకే కేంద్రం ఆ దిశగా పావులు కదుపుతోందని టీడీపీ నేతలు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications