ఊహించని ట్విస్ట్: చేయి కలిపి రాహుల్ భుజం తట్టిన చంద్రబాబు, ఏకమైన 14 పార్టీలు, వేర్వేరుగా చర్చలు
బెంగళూరు/అమరావతి: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులు చేయి కలిపారు. కుమారస్వామి సీఎంగా, కాంగ్రెస్ నేత పరమేశ్వర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Recommended Video
సీఎంగా కుమారస్వామి ప్రమాణం, ఒకే వేదికపై సోనియా-చంద్రబాబు: బీజేపీ నిరసన దినం
వారితో గవర్నర్ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోనియా గాంధీ, మమతా బెనర్జీ, మాయావతి, చంద్రబాబు నాయుడు, అరవింద్ కేజ్రీవాల్, జైపాల్ రెడ్డి, తేజస్వి యాదవ్, అజిత్ సింగ్, హేమంత్ సోరెన్, శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు. శివసేన, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతలు హాజరు కాలేదు.
ఉత్సాహంగా సోనియా, మాయావతి, మమత
ప్రమాణ స్వీకారం అనంతరం పలువురు నేతలు ఒకరినొకరు పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మాయావతి, మమతా బెనర్జీలు చాలాసేపు ఒకేచోట కలిసి ఉన్నారు. సోనియా గాంధీ, మాయావతిలు ఉత్సాహంగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. ప్రాంతీయ పార్టీల నాయకులు అందరూ కలిసిమెలిసి మాట్లాడుకున్నారు.
చంద్రబాబు-దేవేగౌడలు ఆప్యాయంగా
ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నాయుడు.. దేవేగౌడ, కుమారస్వామిల మధ్య కాసేపు ఉన్నారు. అంతకుముందు దేవేగౌడ ఆయనను దగ్గరకు తీసుకున్నారు. ఆయన ఏదో చెబుతుంటే చెవులు రిక్కరించి విన్నారు. చంద్రబాబుతో పాటు సీఎం రమేష్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాహుల్ గాంధీ రాక, పక్కకు జరిగిన చంద్రబాబు
చంద్రబాబుతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీ నాయకులు వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఆ సమయంలోనే మమతా బెనర్జీ - చంద్రబాబుల వెనుక నుంచి రాహుల్ గాంధీ వస్తుండటాన్ని గమనించి ఓ నేత ఏపీ సీఎంకు ఆ విషయం చెప్పారు. దీంతో వారిద్దరు కాస్త పక్కకు జరిగారు.
బాబుతో చేయి కలిపిన రాహుల్ గాంధీ, భుజం తట్టిన ఏపీ సీఎం
అనంతరం వేదిక వద్ద రాహుల్ గాంధీ ముందుకు వచ్చారు. ఆయనకు ఓ వైపు మమతా బెనర్జీ, చంద్రబాబులు ఉన్నారు. రాహుల్ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం వెనక్కి తిరిగి వెనుక వైపు వెళ్తుండగా చంద్రబాబు కనిపించారు. దీంతో వారిద్దరి చేయి కలిపారు. చంద్రబాబు.. రాహుల్ గాంధీ భుజంపై చేయి వేశారు. ఇలాంటి వేడుకలో రాజకీయ ప్రత్యర్థులు చేయి కలపడం సాధారణమే. కానీ ఏపీలో టీడీపీ - కాంగ్రెస్ పార్టీల బద్ధ వైఖరి కారణంగా మనకు కొంత ఆసక్తికరంగా కనిపిస్తుంది.
మమతా బెనర్జీ పాదాలు తాకబోయిన తేజస్వి
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వేదిక పైనున్న మమతా బెనర్జీ పాదాలను తాకబోయారు. ఆమె సున్నితంగా తిరస్కరించారు. సీతారాం ఏచూరీతో తేజస్వీ కాసేపు మాట్లాడుతూ కనిపించారు.
రాహుల్ గాంధీతో చేతులు కలిపిన ప్రాంతీయ పార్టీల నేతలు
ముగింపు సమయంలో రాహుల్ గాంధీతో పాటు ప్రాంతీయ పార్టీ నేతలు మాయావతి, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీ తదితరులు చేతులు పైకెత్తి అందరం కలిసున్నామనే అభిప్రాయం కలిగించారు. మొత్తానికి బీజేపీని ఒంటరిగా ఎదుర్కోలేని కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు ఒక్కటై మోడీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. 14 పార్టీల నేతలు ఒక్కటయ్యారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు తొలిసారి వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. ప్రమాణ స్వీకారానికి ముందే చర్చించారు. మాయావతి, మమత, సురవరం, ఏచూరీ, కేజ్రీవాల్లతో చంద్రబాబు విడివిడిగా భేటీ అయ్యారు.