మోడీ! ఏ మొహం పెట్టుకొని వస్తున్నావ్, చేతులు దులుపుకున్నావ్: చంద్రబాబు నిప్పులు
విజయవాడ/అనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా ఇదే అంశంపై నిలదీస్తున్నారు. తాజాగా, అనంతపురం జిల్లాలోను మాట్లాడారు.
నరేంద్ర మోడీ ఏ మొహం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నారని ఆయన మరోసారి నిప్పులు చెరిగారు. తాము బతికామో, చచ్చామో చూడటానికి వస్తున్నారా అన్నారు. లేక తాము కష్టాల్లో ఉంటే వెక్కిరించడానికి వస్తున్నారా అని ప్రశ్నించారు. మోడీ రాకను ప్రజలంతా వ్యతిరేకించాలన్నారు. మోడీ మనపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారన్నారు.
బీజేపీకి వైసీపీ వంత
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు వచ్చిందని, వచ్చే ఏడాది మే నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని, కేంద్రం సహకరించకపోయినా దీనిని పూర్తి చేస్తామని చంద్రబాబుు చెప్పారు. బీజేపీని, బీజేపీకి వంతపాడే వైసీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వైసీపీ అవినీతి పార్టీ, బీజేపీకి వైసీపీ సహకరిస్తోందన్నారు. అవినీతి పార్టీలను బంగాళాఖాతంలో కలపాలని, ఒడిశా ఒప్పుకున్నా కేంద్రం విశాఖపట్నంకు రైల్వే జోన్ ఇవ్వడం లేదని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్కు రేపు శంకుస్థాపన చేస్తామని, కడప ఉక్కు ఫ్యాక్టరీ పూర్తిచేసే బాధ్యత తమదే అన్నారు. దుగరాజుపట్నం పోర్ట్, పెట్రో కెమికల్ వర్సిటీ ఇస్తామని మోసం చేశారని, విశాఖ, విజయవాడకు మెట్రో రైల్ ఇవ్వడం లేదన్నారు.
కేంద్రాన్ని కోరినా సహకరించలేదు
టీడీపీ ప్రభుత్వం రైతు రుణమాఫీని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ముందడుగు వేసేందుకు ప్రయత్నించినా కేంద్రం మోకాలడ్డిందని చంద్రబాబు అన్నారు. అయినప్పటికీ ఒకేసారి రూ.50 వేల చొప్పున రుణమాఫీ చేసిన ఘనతను తమ ప్రభుత్వం దక్కించుకుందన్నారు. 62 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో 17 పూర్తయ్యాయని, మరో 6 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. రుణమాఫీకి సహకరించాలని కేంద్రాన్ని ఎంత కోరినా కనికరించలేదన్నారు. పైగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.16 వేల కోట్ల నిధులకు కోత విధించారన్నారు.
నాలుగేళ్ళ తర్వాత ఏపీకి ఏం చేయలేదు
చంద్రబాబు అనంతపురంలో జరిగిన ధర్మపోరాట దీక్ష సభలో ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మోడీ తప్పారన్నారు. నాలుగేళ్ల తర్వాత కూడా ఏపీకి మోడీ న్యాయం చేయలేదన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతుంటే మన వాళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారన్నారు. నాడు అమరావతికి వచ్చిన మోడీ మట్టి, నీళ్లు ఇచ్చి తన చేతులు దులుపుకున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు.
ఉక్కు కర్మాగారం
ఇదిలా ఉండగా, చంద్రబాబు రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించే ఉక్కు కర్మాగారానికి రేపు ఉదయం 11 గంటలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మైలవరం మండలం ఎం. బాలదిన్నె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు. రూ.18 వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలనేది ప్రభుత్వ యోచన. సీఎం రమేశ్ మాట్లాడుతూ.. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తోందన్నారు. ఈ విషయమై పలుమార్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి విన్నవించినా స్పందించలేదని, శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేతలూ హాజరుకావాలని కోరుతున్నానన్నారు.