జగన్ పార్టీ నో చెప్పినా, రాజధానిపై తీర్మానం, కేంద్రానికి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శాసన సభలో ప్రకటన చేస్తున్నారు. విజయవాడ పరిసరాల్లో రాజధానిని ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయించామని చెప్పారు. చంద్రబాబు రాజధాని పైన ప్రకటన చేస్తున్నప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు నిరసన తెలిపారు. గందరగోళం మధ్యనే రాజధాని పైన బాబు ప్రకటన చేశారు.
రాజధాని విజయవాడ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. ఏపీలోని పదమూడు జిల్లాలకు పలు సంస్థలను కేటాయించారు.
రాజధాని పైన తీర్మానానికి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనుంది. ప్రతిపక్షం రాజధాని పైన విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ తీర్మానం చేయాలని చూస్తోంది.
రాజధాని పైన చంద్రబాబు ఇరవై పేజీలతో ప్రకటన చేయాలనుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు ఆందోళన తెలపడంతో ప్రతులను పంచారు.
మీడియా వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు మాట్లాడుతూ అధికార పార్టీ పైన నిప్పులు చెరిగారు. అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం తీసుకోమంటే అధికార పక్షం అలా చేయడం లేదని విమర్శించారు. తమ వారి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధానిని చేస్తున్నారని ఆరోపంచారు. బెజవాడ పరిసరాలను రాజధానిగా చేయడం ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయని ఆరోపించారు.
విపక్షాల గందరగోళం నేపథ్యంలో సభాపతి కోడెల శివప్రసాద్ శాసన సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు.
తిరుపతి, విశాఖ, విజయవాడల్లో అంతర్జాతీయ ఎయిర్ పోర్టులు నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే బెజవాడను రాజధానిగా ప్రకటన చేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడలో రాజధానిని ప్రకటించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు అన్నారు. ఇడుపులపాయలో రాజధానిని చేస్తే సంతోషమా అని ఎద్దేవా చేశారు. అందరికీ సమదూరంలో రాజధాని ఉందన్నారు.
సభలో రాజధాని ప్రకటన కాపీలను పంచారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ నిరసనను పోడియం వద్ద అలాగే తెలుపుతుండటంతో ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. తాము చర్చకు సిద్ధమంటే.. చర్చించాలని ప్రతిపక్షం డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అయినా కూడా వైయస్సార్ కాంగ్రెస పార్టీ సభ్యులు వెనక్కి తగ్గలేదు.
చంద్రబాబు ప్రకటన చేస్తున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్ర నిరసన తెలిపింది. సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చారు. దీంతో బాబు తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు.
మీకు ఏం కావాలో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ప్రశ్నించారు. చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రాజధాని పైన చర్చకు ప్రతిపక్షం సహకరించడం లేదన్నారు. రాజధాని భూసేకరణకు సబ్ కమిటీ వేసినట్లు చెప్పారు. మీరు అడిగితే నేను సమాధానమిస్తానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలు నిర్మిస్తామని చంద్రబాబు సభలో ప్రకటించారు. విజయవాడ పరిసరాల్లో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అందరికీ అందుబాటులో ఉండాలని రాజధాని పైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తన ప్రసంగాన్ని పదేపదే అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేయడంతో చంద్రబాబు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సభకు సహకరించాలన్నారు.