మోడీ! ఇదేనా టీమిండియా, పేరు చెడగొడ్తున్నావ్: కాశ్మీర్ ప్రభుత్వం రద్దుపై బాబు ఆగ్రహం
అమరావతి: జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ రద్దు అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం స్పందించారు. అసెంబ్లీ రద్దు అంశంపై కేంద్ర ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దు బీజేపీ నేతల ఫాసిస్టు చర్యలకు నిదర్శనం అని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఓ వైపు టీమిండియా స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెబుతారని, మరోవైపు ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కాలరాయడమే టీమిండియా స్ఫూర్తియా అని నిలదీశారు. అసలు ఇది టీమిండియానా లేక బ్లేమ్ ఇండియానా అని ప్రశ్నించారు.
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ రద్దు: చేతులు కలుపుతున్న ముఫ్తీ, ఒమర్, కాంగ్రెస్, తెరపైకి కొత్త సీఎం
దేశానికి ఉన్న మంచి పేరును చెడగొడుతున్నారు
దేశానికి ఉన్న మంచి పేరును చెడగొడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. గడువు తీరకముందే జమ్ము కాశ్మీర్ అసెంబ్లీని రద్దు చేయడం అప్రజాస్వామికమని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ చర్యను ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కోరినా గవర్నర్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు.
కర్ణాటకలోను ఇలాగే చేసారు
గతంలో కర్ణాటకలో అధికారం చేజిక్కుంచుకునేందుకు బీజేపీ నేతలు కుయుక్తులు పన్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు జమ్ము కాశ్మీర్లో అప్రజాస్వామికంగా అసెంబ్లీని రద్దు చేశారన్నారు. పీడీపీ ముఫ్తీకి కాంగ్రెస్, ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల మద్దతు ఉందని చెప్పారు.
నా నిర్ణయం సరైనదే
కాగా, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై భిన్న స్పందనలు వస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీ రద్దుపై తన నిర్ణయాన్ని గవర్నర్ సమర్థించుకున్నారు. సాధ్యం కాని కూటమికి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వలేనని, రెండు విరుద్ధమైన రాజకీయ సిద్ధాంతాలు గల పార్టీలు కలిసి పని చేయడం అసాధ్యమని, అలాంటి పార్టీలు కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని తెలిపారు. కూటమితో ఈ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేయడం, నగదు చేతులు మారడం తదితర సమస్యలు తలెత్తుతాయన్నారు.
మాజీ సీఎం ముఫ్తీ వర్సెస్ గవర్నర్
పీడీపీ అధినేత ముఫ్తీకి బుధవారం రాజ్ భవన్కు సెలవు దినం అని తెలుసునని, కాబట్టి లేఖ ముందే పంపించవలసి ఉండెనని గవర్నర్ అన్నారు. మరోవైపు, తాను నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్పడానికి గవర్నర్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, ఫ్యాక్స్ చేసేందుకు ప్రయత్నిస్తే గవర్నర్ కార్యాలయంలోని ఫ్యాక్స్ మెషిన్లో టెక్నికల్ సమస్యతో ఫ్యాక్స్ వెళ్లలేదని ముఫ్తీ చెప్పారు. దీంతో తాను లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశానని చెప్పారు.
ఒమర్ అబ్దుల్లా ఏమన్నారంటే?
జమ్ము కాశ్మీర్ పరిణామాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. తమకు న్యాయం జరగలేదని, నగదు చేతులు మారుతుందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారని గవర్నర్ చెప్పారని, ఈ ఆరోపణలపై గవర్నర్ వివరణ ఇవ్వాలని, అందుకు సాక్ష్యాలు ఏమిటో చెప్పాలన్నారు. పీడీపీ, తమ పార్టీ కూటమిది అపవిత్ర కూటమి అని ఆయన ఎలా చెబుతారన్నారు. రాష్ట్రం కోసం తాము కలిశామని చెప్పారు. రాజ్ భవన్లోని ఫ్యాక్స్కు ముఫ్తీ లేఖ పంపిస్తే వెళ్లలేదని, అసెంబ్లీ రద్దు కోసం మాత్రం ఫ్యాక్స్ పని చేసిందని, దీనిపై విచారణ జరగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారం ఆయన నడుచుకున్నారని ఆరోపించారు.
అసలేం జరిగిందంటే?
కాగా, జూన్లో పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. దీంతో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి నుంచి అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంది. ఈ నేపథ్యంలో 28 స్థానాలున్న పీడీపీ, 15 స్థానాలు ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్(15లతో పాటు కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇద్దరు సభ్యులున్న పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సాజద్ లోన్ కూడా 25 స్థానాలు ఉన్న బీజేపీ, 18 స్థానాలు ఉన్న స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. 87మంది సభ్యులున్న జమ్ముకాశ్మీర్ సభలో 44మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు.