20ఏళ్ల నుంచి మనం ఇలాగే, కేసీఆర్ గిఫ్ట్ తీసుకుంటా, ఫ్రస్టేషన్తో తెలంగాణలో జగన్ కేసు: డేటాచోరీపై బాబు
అమరావతి: ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత జగన్ ఫ్రస్టేషన్తో తెలంగాణలో మనపై కేసులు పెట్టే స్థితికి వచ్చిందన్నారు. గత ఇరవై ఏళ్ళ నుంచి మన పార్టీకి చెందిన సమాచారం కంప్యూటరీకరిస్తున్నామని, దానిని తెలంగాణ ప్రభుత్వం సాయంతో దొంగిలించే నీచానికి ఒడిగట్టారన్నారు.
కోర్టులో చివాట్లు తినడం వారి నీచానికి చెంపపెట్టు
ఏపీ సీఎం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోర్టులో చివాట్లు తినడం వాళ్లు ఒడిగట్టిన నీచానికి చెంపపెట్టు అని చంద్రబాబు అన్నారు. ఓటమి భయంతోనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టారని మండిపడ్డారు. జగన్ దుర్మార్గాలకు మోడీ, కేసీఆర్ సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎనిమిది లక్షల టీడీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారన్నారు.
వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం
తాము టెక్నాలజీని ప్రోత్సహిస్తుంటే, సైబర్ క్రైంను వాళ్లు ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటికీ గట్టిగా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బోగస్ ఓట్లు పేర తొలగింపునకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ ఇప్పుడే ఇలా చేస్తే అధికారంలోకి వస్తే ఇంకెన్ని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతారని మండిపడ్డారు. దీనిపై అంతా చైతన్యం కావాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ నాకిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?
టీడీపీ యాప్ సర్వీస్ ప్రొవైడర్లపై దాడులు దుర్మార్గమైన చర్య అని చంద్రబాబు అన్నారు. ఆస్తి ఏపీలో ఉంటే చోరీ కేసు తెలంగాణలో ఎలా పెడతారని నిలదీశారు. ఏపీలో కేసులు పెడితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో తెలంగాణలో టీడీపీపై కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదేనా కేసీఆఱ్ నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని ప్రశ్నించారు. గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు ప్రతీకారంతో ఇస్తారా అని నిలదీశారు. ఇలాంటి రిటర్న్ గిఫ్ట్లు ఎన్నైనా తీసుకుంటామన్నారు.
నేరాలు చేయడంలో ఆరితేరారు
ఓట్ల తొలగింపుపై గురువారం ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సీఎం చంద్రబాబు పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. ఓట్ల నమోదు, తొలగింపులో తప్పుడు పనులను సహించబోమన్నారు. తప్పుడు దరఖాస్తుదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దొంగ సంతకాలు పెట్టిన వారందరినీ గుర్తించాలని ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సైబర్ నేరగాళ్లను ఎవరినీ వదిలేది లేదన్నారు. నేరాలు చేయడంలో వైసీపీ నేతలు ఆరితేరారని ధ్వజమెత్తారు.