మాకు మిత్రులు, బాగా కష్టపడుతున్నారు: బాబుపై మోడీ, ఏపికి కావాల్సినవి ఇవే!
న్యూఢిల్లీ: తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా మంగళవారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని ముందు చంద్రబాబు ఏకరువు పెట్టారు. వివిధ అంశాలకు సంబంధించి ప్రత్యేక నివేదికలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. చంద్రబాబు వాదనను సాంతం విన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'మీరు మా మిత్రులు. బాగా కష్టపడతారు. మీకు బాగా అనుభవం ఉంది' అంటూ ప్రధాని మోడీ.. చంద్రబాబు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో మిత్రపక్షమైన చంద్రబాబును ప్రధాని తన వ్యక్తిగత మిత్రుడిగానూ అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంలోని సున్నితత్వం తనకు తెలుసని, ఆ విషయంలో ఆందోళన వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు తెలిసింది. ఈ అంశం ఎంత ముఖ్యమో అవగాహన ఉందని, దానిని పరిష్కరించుకుందామని అన్నట్లు సమాచారం. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ప్రస్తావించి... అది రాష్ట్రంలో ఎలా భావోద్వేగ అంశంగా మారిందీ వివరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ముందుగా పది నిమిషాలపాటు అనుకున్న ముఖాముఖి 20 నిమిషాలపాటు జరిగిందని తెలిసింది. 'రాజకీయంగా మనం స్నేహితులం, భాగస్వాములం, ఎప్పటికీ కలిసే పని చేద్దాం' అని చంద్రబాబుతో మోడీ అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి అభివృద్ధి ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్, రెవిన్యూలోటు భర్తీ తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. వీటిపై ఆర్ధికశాఖ మంత్రి అరుణ్జైట్లీతో మాట్లాడాలని ప్రధాని సూచించారు.
అనంతరం ఆర్ధిక మంత్రితోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై పూర్తి అవగాహన ఉంది. పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం చూద్దాం' అని అరుణ్జైట్లీ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అదే సమయంలో జైట్లీ తన మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులతో మాట్లాడి వివిధ అంశాలను సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ వీలయినంత త్వరలో నెరవేరుస్తామని చంద్రబాబుకు ప్రధాని హామీ ఇచ్చారు. నిర్దిష్ట కాలవ్యవధిలో అమలు చేయాల్సిన 12 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి ముఖ్యమంత్రి సమర్పించారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కి నెలకొన్న రెవెన్యూ లోటు భర్తీ చేయడం చాలా అవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
2019-20 సంవత్సరం నాటికి 14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి పూర్తయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు ఆదాయం లోటు ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా ఎందుకు మంజూరు చేయాలో చెబుతూ ఇతర కారణాలనూ వివరించారు. ఏపీకి ఇచ్చే ఈఏపీ (ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు) సాయాన్ని ఏడాదికి కనీసం రూ.5వేల కోట్లకు పెంచాల్సిందిగా ఆర్థిక మంత్రిత్వశాఖను ఆదేశించాలని ప్రధానిని చంద్రబాబు కోరారు.
పొరుగు రాష్ట్రాలతో సమానంగా పోటీ పడడానికి ఉపకరించే విధంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్డీపీలో అదనంగా ఒక శాతం రుణం సమకూర్చుకునే అవకాశం కల్పించాలని కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వనరుల అంతరాన్ని పూడ్చే విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.
రూ.13,275 కోట్ల సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ) చట్టంలో సడలింపులు ఇవ్వాలని కూడా కోరారు. పోలవరం ప్రాజెక్టుపై 2014. ఏప్రిల్ 14 నుంచి రాష్ట్రప్రభుత్వం చేసిన ఖర్చు రూ.1,472 కోట్లు కేంద్రం చెల్లించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ ప్రాజెక్టు 2018 నాటికి పూర్తవడానికి అవసరమైన నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు.
కొత్త రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇతరత్రా అవసరమైన మౌలిక సదుపాయాలకు మరో మూడేళ్ల పాటు రూ.10వేల కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధి నుంచి ఆర్థికసాయం చేయాలని కూడా కోరింది. అమరావతి అభివృద్ధికి జీరో కూపన్ బాండ్లు, పన్ను రహిత బాండ్లు జారీ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరింది.
పదేళ్ల పాటు మూలధన రాయితీ 30శాతం, కేంద్ర ఎక్సైజ్ సుంకం, ఆదాయపు పన్ను, సేవా పన్ను నుంచి 100శాతం మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్తో సమానంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల అభివృద్ధికి వచ్చే ఎనిమిదేళ్ల పాటు జిల్లాకు ఏడాదికి రూ.200 కోట్ల చొప్పున ఆర్థిక సాయం చేయాలని కోరారు.
కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించి నదీ జలాల న్యాయబద్ధ పంపకంలో సమస్యలను పరిష్కరించుకునేందుకు సర్వోన్నత మండలి సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరింది. నియోజకవర్గాల పునర్విభజనకు వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కు పెంచాలని గుర్తు చేసింది.
పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, షెడ్యూల్ 13లోని మౌలిక సదుపాయాలు, ఆర్థిక చర్యల సమస్యలను పరిష్కరించాలని కోరారు. విశాఖపట్టణానికి ప్రత్యేక రైల్వేజోన్ను ఇవ్వాలని కోరారు. 12వ షెడ్యూల్లో హామీ ఇచ్చినట్లు దుగరాజపట్నం ఓడరేవు, కడపలో సెయిల్ కర్మాగారం, విజయవాడ, విశాఖపట్నంలో మెట్రోరైలు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సాయం చేయాలని ఏపి ప్రభుత్వం కోరింది.