వీరి తీరు ఘోరం, ఇందుకేనా, తేల్చుకుందాం: మోడీ-జైట్లీపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Recommended Video

హైదరాబాద్/అమరావతి: అరుణ్ జైట్లీ లోకసభలో చేసిన ప్రకటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నిరసన పెంచాలన్నారు. సస్పెండ్ అయినా వెనుకాడవద్దని చెప్పారు. ఉభయ సభల్లో మరింత గట్టిగా ఆందోళనలు వ్యక్తం చేయాలన్నారు. పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోను తీవ్రతరం చేయాలన్నారు. పార్లమెంటు లోపల, బయట ఆందోళనలు కొనసాగించాలన్నారు. ఇక ఏమాత్రం తగ్గేది లేదన్నారు. అవసరమైతే బీజేపీతో తెగదెంపులు చేసుకుందామని, త్వరలో నిర్ణయం తీసుకుందామని కూడా ఎంపీలకు చెప్పారని తెలుస్తోంది.

కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తోంది
ఎంపీలు, ఎమ్మెల్యేలతో జరిగిన టెలి కాన్ఫరెన్సులో పార్లమెంటులో ఎంపీల ఆందోళన, కేంద్రం ప్రతిస్పందన, భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు మాట్లాడారు. మోడీ, జైట్లీ ప్రసంగాలు తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయన్నారు. ఇంత ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టనట్లుగా వ్యవహరించడం విడ్డూరమన్నారు.

ఇందుకోసమేనా మనం ఎదురు చూసింది
గురువారం కూడా చంద్రబాబు ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాకేమో అన్నీ చేస్తామని చెబుతారని, మన అధికారులను ఢిల్లీలో కూర్చోబెట్టుకొని మూడు రోజులుగా మాట్లాడుతున్నారని, చివరకు ఏం చెప్పారని, ఆ ప్రకటనల్లో ఏముందని, ఇందుకోసమేనా మనం ఎదురు చూసిందని అసహనం వ్యక్తం చేశారు.

వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు
వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, మన పోరాటం కొనసాగుతుందని, ఆపేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. అవసరమైతే అప్పు తెచ్చి అయినా ఏపీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. తన పరిధిలో ఉన్న అంశాల గురించే మాట్లాడుతానని జైట్లీ తొలుత చెప్పారని, ఇతర అంశాల గురించి అడిగితే అమిత్ షాకు చెప్పమన్నారని, షా చెప్పిన తర్వాత ఇతర అంశాల గురించి మాట్లాడుతానని జైట్లీ అన్నారని, దీంతో రైల్వే జోన్ గురించి పీయూష్ గోయల్ను కలవాల్సి వచ్చిందన్నారు.

కేంద్రం ప్రవర్తన ఘోరంగా
కేంద్రం ప్రవర్తన ఘోరంగా ఉందని మోడీ, జైట్లీ ప్రసంగాలను ఉద్దేశించి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మనం 19 ప్రధాన డిమాండ్లను అడిగితే వాటిపై అంశాలవారీగా సమాధానం ఇస్తారనుకుంటే జైట్లీ ఎప్పటిలైగా జవాబు ఇచ్చారని, అందులో కొత్తదనం లేదన్నారు. కాగా, జైట్లీ రాజ్యసభలో శుక్రవారం సమాధానం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో నిరసనలు వ్యక్తం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications