చంద్రబాబు తొలి ప్రయాణం.. అక్కడికే
Chandrababu Naidu: రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటయింది. ఈ ఉదయం 11: 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోండటం విభజనాంధ్ర ప్రదేశ్లో ఇది రెండోసారి. మొత్తంగా నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారాయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకోబోనున్నారు.

చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అర్ధరాత్రి వారి జాబితాను సిద్ధం అయింది. ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాలో పవన్ కల్యాణ్ సహా జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. బీజేపీ నుంచి వై సత్యకుమార్ను తీసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ఉదయం 10:40 నిమిషాలకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయన కేబినెట్ సహచరులు అమిత్ షా, జేపీ నడ్డా, జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, హెచ్ డీ కుమారస్వామి.. తదితరులు ఇప్పటికే విజయవాడుకు చేరుకున్నారు.

ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు.. తిరుమల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కటుంబ సభ్యులతో కలిసి ఈ సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరి వెళ్తారు.
రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. అక్కడి పద్మావతి అతిథిగృహంలో బస చేస్తారు. బుధవారం తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకుంటారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వేంకటేశ్వరస్వామివారి సేవలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు విజయవాడకు చేరుకుంటారు.












Click it and Unblock the Notifications