లండన్కు జగన్, బాబు ప్రచారం: 'నేను మీకు అన్నీ ఇచ్చానుగా', అందుకు రూ.100 కోట్లు
నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టిడిపికి ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అప్పుడే 2019 ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది.
Recommended Video
అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టిడిపికి ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అప్పుడే 2019 ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు వైసిపి అధినేత జగన్ లండన్ పయనమయ్యారు.
జగన్కు షాక్: దెబ్బతో టిడిపిలోకి గుర్నాథ్? పరిటాల-జెసిలతో సంబంధాలు
సీఎం సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 2019లో తమను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత మూడేళ్లలో తాను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని టిడిపికి ఓటు వేయాలన్నారు.
భారీ టార్గెట్
వచ్చే ఎన్నికల్లో టిడిపి 175 స్థానాల్లో గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సార్వత్రిక ఎన్నికలకు మరో 21 నెలల సమయం ఉంది. ఈ సమయంలో సీఎం ఇప్పుడే 2019 ఎన్నికల గురించి మాట్లాడుతుండటం గమనార్హం.పైగా, 175 స్థానాలు గెలవాలని చెప్పడం అతివిశ్వాసమేనని కొందరు అంటున్నారు.
ప్రతి ఇంటికి వెళ్తా
తాను ప్రతి ఇంటికి వెళ్తానని, వారి ఇంటి ముందుకు వెళ్లి నేను ఏం చేశానో చెబుతానని చంద్రబాబు అన్నారు. గత మూడేళ్లలో చేసిన పనులు చెబుతానన్నారు. అంటే ఇక్కడ తాను ప్రతి ఇంటికి వెళ్తాను అంటే.. టిడిపి కార్యకర్తలు వెళ్తారని అర్థం.
నాకు మరో అవకాశమివ్వండి
2014లో తాను ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చానని చంద్రబాబు చెప్పారు. అంతకంటే ఎక్కువే చేశానని తెలిపారు. కాబట్టి నాకు మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2019లో టిడిపి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
మీకు నేను అన్నీ ఇచ్చాక వైసిపి వైపు ఎందుకు చూస్తారు
టిడిపి ప్రభుత్వం ప్రజలకు కావాల్సింది అంతా చేస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మీకు కావాల్సినవి అన్నీ నేను చేస్తున్నప్పుడు మీరు పక్క పార్టీల వైపు ఎందుకు చూస్తారని వైసిపిని ఉద్దేశించి అన్నారు. నన్ను ఆశీర్వదించండి అన్నారు. మీకు మరోసారి సేవ చేసే అవకాశమివ్వండి అన్నారు.
నన్ను ఆకట్టుకున్నారు
ఇదిలా ఉండగా, సృజనాత్మక ఆలోచనల దిశగా యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని చంద్రబాబు విశాఖలో అన్నారు. మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సృదన సదస్సు - 2017లో ఆయన మాట్లాడారు. సుమారు 30 దేశాల నుంచి వచ్చి తమ ఆవిష్కరణలను ప్రదర్శించడం తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు.
రూ.100 కోట్ల నిధి
సృజనాత్మక ఆలోచనల్ని ప్రోత్సహించి వారితో మంచి ఉత్పత్తులు ఆవిష్కృతం చేయడానికి వీలుగా రూ.100 కోట్ల నిధిని ఇన్నోవేషన్ సొసైటీకి కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏటా అంతర్జాతీయ సృజన సదస్సులను మన రాష్ట్రంలోనే సెప్టెంబరు 9 నుంచి 11 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించారు.