అర్థంకావట్లేదు, ఓపిక పట్టండి: బాబు బాధ, క్లర్క్ స్థాయి..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఆంధ్రప్రదేశ్ బ్లాకులను శుక్రవారం సందర్శించిన చంద్రబాబు అక్కడి పరిస్థితులను చూసి.. ఏం అర్థం కావట్లేదని, కాస్త ఓపిక పట్టాలని ఉద్యోగులకు సూచించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సచివాలయంలో పని చేసేందుకు అనువైన వాతావరణంలేదని చెప్పారు. ఆర్డీవోస్థాయి అధికారులు క్లర్క్ స్థాయి వాతావరణంలో పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు శుక్రవారం సచివాలయానికి వచ్చారు. ఏపీకి కేటాయించిన బ్లాకులను సందర్శించారు. ఈ సమయంలో ఉద్యోగులు.. పని చేసేందుకు అనువుగా లేదని చెప్పారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. కాస్త ఓపిక పట్టాలని, పరిస్థితులను అన్నింటిని తాను చక్కదిద్దుతానని చెప్పారు. అంతేకాకుండా దేశంలోనే మెరుగైన జీతాలు ఇస్తానని హామీ ఇచ్చారు. చాలా చాంబర్లలో తాళాలు వేసి ఉండటం అధ్వాన్నస్థితికి అద్దం పడుతోందన్నారు. చాంబర్లు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు చెప్పారు. అయితే మూడు నెలల సమయం పడుతుందని వారు చెప్పారు.

ఎల్, జె బ్లాకులను సందర్శించిన చంద్రబాబు ఉద్యోగుల ఏర్పాట్ల పైన ఆరా తీశారు. పరిస్థితులు ఎప్పటిలోగా అదుపులోకి వస్తాయో అర్థం కాకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీవో స్థాయి అధికారికి ఒక బల్ల, నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారన్నారు. పదిహేను రోజుల్లో ఉద్యోగులకు వసతులు ఏర్పాట్లు చేయాలన్నారు.
అంతకుముందు చంద్రబాబు ట్యాంక్ బండ్ పైన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బ్రిటీష్ వారి అరాచక పాలనను వ్యతిరేకించి పోరాడిన గొప్ప స్వాతంత్ర్యోద్యమ వీరుడు అల్లూరి అని కొనియాడారు. గిరిజనుల హక్కుల కోసం తన జీవితాన్నే ధారపోసిన మహోన్నత వ్యక్తి అన్నారు. నిస్వార్థంగా ప్రజల కోసం పోరాడిన అల్లూరిని అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అన్ని తరాలకు అల్లూరి ఓ స్పూర్తి అన్నారు. విశాఖలో అల్లూరి పేరిట ఓ మెమోరియల్ (స్మారకం) ఏర్పాటు చేస్తామని... అందులో అల్లూరికి చెందిన ఫొటోలు, వివరాలు, విషయాలు అన్నీ ఉంటాయన్నారు. అల్లూరి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరుపుకుంటామన్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో అల్లూరి జయంతిని నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అల్లూరి గొప్పతనాన్ని దేశ వ్యాప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని, పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తామన్నారు.
అల్లూరి స్ఫూర్తిదాయకం: పీతల సుజాత
బ్రిటిష్ వారిని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఉద్యమాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఏపీ మంత్రి సుజాత అన్నారు. మోగల్లులో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థ జైన్ను మంత్రి కోరారు. అల్లూరి సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరిలో సీతారామరాజు 117వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జ్యూట్ మిల్లు జంక్షన్ లో ఉన్న అల్లూరి విగ్రహానికి మంత్రి పీతల సుజాత, ఎంపీ మాగంటి బాటు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి పూలమాలలు వేసి నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications