‘‘ఐదు కోట్ల ఆంధ్రులు నట్టేట, అన్నిసార్లు వెళ్లి ఏం సాధించారు? అసలు నాయకుడివేనా?’’
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఐదు కోట్ల మంది ఆంధ్రులను నట్టేట ముంచాయని వైఎస్సర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆస్కార్ నటులను మించి చంద్రబాబు ఆయన మంత్రులు నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంతో పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో తప్పు మీదంటే, కాదు మీదంటూ బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు పరస్పరం లేఖలు రాసుకుంటున్నాయని, ఏపీకి జరిగిన అన్యాయంలో ఇద్దరి పాత్రా ఉందని, అయితే ఏ1 ఎవరు, ఎ2 ఎవరన్నది తేలాలని పార్థసారథి వ్యాఖ్యానించారు.
జగన్ అడిగితే చంద్రబాబు మౌనం...
2015లో అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును అడిగారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారో స్పష్టం చేయాలంటూ ఆయన చంద్రబాబును ప్రశ్నించారని పార్థసారధి పేర్కొన్నారు. అంతేకాదు, నెలన్రర సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనిపక్షంలో కేంద్రానికి అల్టిమేటం ఇవ్వగలరా? అని కూడా అడిగారని, అప్పుడు అన్నిటీకీ చంద్రబాబు మౌనం వహించారని ఆయన పేర్కొన్నారు.
29 సార్లు వెళ్లి సాధించిందేమిటి?
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 29 సార్లు ఢిల్లీకి వెళ్లినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతుంటారని, మరి అన్నిసార్లు వెళ్లి ఆయన సాధించిందేమిటని వైఎస్సార్సీపీ నాయకుడు పార్థసారధి ప్రశ్నించారు. ఇన్నాళ్లూ నిద్ర పోయిన బాబు ఇప్పుడు లేచి ప్రత్యేక హోదా ఎందుకివ్వరంటూ కేంద్రాన్ని నిలదీయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అన్ని లేఖల్లో.. ఒక్కసారైనా అడిగారా?
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఇప్పుడు ఇంత గోల చేస్తోన్న చంద్రబాబు గతంలో తాను కేంద్రానికి రాసిన ఒక్క ఉత్తరంలోనైనా ఈ మేరకు కోరారా? అని పార్థసారధి ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఎందుకివ్వరని ఆయన ప్రశ్నిస్తున్నారని, మరి ఇదే ప్రశ్న నాలుగేళ్ల క్రితమే బీజేపీ ప్రభుత్వానికి సంధించవచ్చుకదా అని అన్నారు.
అసలు నువ్వు నాయకుడివేనా?
ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పింది కనుక ప్యాకేజీకి ఒప్పుకున్నానని చంద్రబాబు చెబుతున్నారని, అలా ఒప్పుకునేముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ఏమిటో తెలుసుకున్నారా? అని పార్థసారధి అడిగారు. మాట్లాడితే 40 ఏళ్ల రాజకీయ జీవితం, దేశంలోనే సీనియర్ నేతల్లో ఒకరినంటూ చెప్పుకునే చంద్రబాబుకు అసలు నాయకత్వ లక్షణాలే లేవంటూ పార్థసారధి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనకు ఎక్కడ ఓట్లు వేయరో అన్న భయంతోనే బాబు ఇప్పుడు ప్రత్యేక హోదా మంత్రం జపిస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు.