అధికారానికి 3 అంశాలపై వ్యూహరచన చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024లో నిర్వహించనున్న ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఎట్టి పరిస్థితుల్లోను విజయ బావుటా ఎగరవేయాలనే పట్టుదలతో అధినేత చంద్రబాబునాయుడు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. ఇప్పటినుంచే రాష్ట్రవ్యాప్తంగా అడపా దడపా పలు పర్యటనలు చేపడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపుతున్నారు.

ఈ మూడువర్గాలను ఆకట్టుకుంటే..
గత ఎన్నికల్లో ఓటమి పాలవడానికి ప్రధాన కారణాలు, ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన అంశాలను ఆయన బేరీజు వేసుకుంటున్నారు. ప్రధానంగా ఉన్నతస్థాయి, మధ్యతరగతి వర్గాలతోపాటు తటస్థ ఓటర్లపై దృష్టిసారించారు. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది? ఎలా చేస్తే అభివృద్ధి పథంలో పయనించగలం? ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా? ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరు? తదితర అంశాలపై వీరికి పూర్తిస్థాయి అవగాహన ఉంటుందనేది చంద్రబాబు అభిప్రాయంగా ఉంది.

రాష్ట్రం బాగు కోసం ఓటు వేయండి!
పైన పేర్కొన్న మూడు వర్గాలను పూర్తిగా ఆకర్షించుకోగలిగితే రానున్న ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకలా సాగుతుందని బాబు భావిస్తున్నారు. గతంలో కూడా తటస్థ అభ్యర్థులతో ఎన్నికల్లో ప్రయోగం చేసినప్పుడు విజయం సాధించగలిగామని, ఆ సమయంలో తటస్థంగా ఉండే ఓటర్లంతా తెలుగుదేశంపార్టీవైపు మొగ్గుచూపినట్లు అంచనా వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేసేందుకే తాము పనిచేస్తున్నామని, పార్టీకన్నా, వ్యక్తులకన్నా పరిపాలన చూసి, రాష్ట్రం బాగుకోసం ఓటువేయాలని కోరనున్నారు.

ఓటుబ్యాంకును చేజారనీయకుండా..
మరోవైపు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పథకాల పేర్లతో ఓటుబ్యాంకును రూపొందించుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న తరుణంలో తమ పార్టీ ఓటుబ్యాంకును చెక్కుచెదరనీయకుండా చూసుకోవడంతోపాటు కొత్త ఓటుబ్యాంకును రూపొందించుకునే పనిలో బాబు ఉన్నారు. అందులో భాగమే మధ్యతరగతి, ఉన్నతశ్రేణితోపాటు తటస్తులను పార్టీకి దగ్గరచేసే ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఇందులో ఎంతమేరకు విజయకేతనం ఎగరవేయగలరనేదానికి కాలమే సమాధానం చెప్పబోతోంది.!!












Click it and Unblock the Notifications