తెలంగాణ ఒకటే సమస్య కాదు, కేంద్రం చొరవేది?: విభజనపై చంద్రబాబు
హైదరాబాద్/అమరావతి: హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ ఒకటే సమస్య అని చెప్పడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రం ఈ విషయంలో కొంత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
ఆదివారం వెలగపూడిలో చంద్రబాబు మాట్లాడుతూ.. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం జోక్యం అవసరమని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వారి సమస్యలను మాత్రమే చూపుతూ, నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న పెను సమస్యల గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.
రెండు రాష్ట్రాలూ చర్చించి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయని, కేంద్రం కల్పించుకోవాల్సిన సమస్యలూ ఉన్నాయని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలూ పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలియజేశారు.
ఆగస్టు నాటికి పూర్తి స్థాయి తరలింపు: హైదరాబాద్లోనూ ఉద్యోగులు
ఆగస్టు చివరి నాటికి సచివాలయ ఉద్యోగులను పూర్తి స్థాయిలో వెలగపూడి కార్యాలయానికి తరలించడం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. అప్పటి వరకు వెలగపూడిలో సచివాలయ నిర్మాణం పూర్తయిపోతుందని చెప్పారు.
అంతేగాక, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఉద్యోగులందరినీ పూర్తిగా అమరావతికి షిఫ్ట్ చేయబోవడం లేదని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కొంతమందిని అక్కడే ఉంచుతామని తెలిపారు. ఎవరెవరిని అక్కడే ఉంచాలన్న విషయమై మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నవారు, వయసు పెరిగి పదవీ విరమణకు దగ్గరైన వారు, మానవీయ కోణంలో పరిశీలించి ఎంపిక చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.
మొత్తం ఉద్యోగుల్లో 5 నుంచి 10 శాతం మాత్రమే హైదరాబాద్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిగతావారంతా అమరావతికి వచ్చేస్తారని చంద్రబాబు తెలియజేశారు.
ఆలయాల కూల్చివేతపై..
ఆ తర్వాత గుంటూరు, విజయవాడ రహదారి వెడల్పులో భాగంగా ఆలయాల కూల్చివేతపైనా చంద్రబాబు స్పందించారు. ఆలయాల కూల్చివేతను శాస్త్రోక్తంగా జరపాలని సూచించారు. రెండు పార్టీలు సంయమనం పాటించాలని టిడిపి, బిజెపి నేతలకు సూచించారు.