రాజమండ్రి ఘటన నుంచి తేరుకోలేకపోతున్నా: భావోద్వేగానికి గురైన చంద్రబాబు
రాజమండ్రి: మహా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, దురదృష్టవశాత్తు అపశ్రుతి చోటుచేసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రమాదాన్ని నివారించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా నివారించలేకపోయామని, నాటి ఘటన నుంచి తాను ఇంకా తేరుకోలేకపోతున్నానని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో నదుల అనుసంధానంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడారు. పుష్కరాల ప్రారంభ రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సంఘటన గురించి తెలిసిన తర్వాత, పుష్కరఘాట్ వద్ద సాధారణ పరిస్థితి వచ్చేంత వరకు అన్ని చర్యలు తీసుకుని ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను ఓదార్చి, మెరుగైన వైద్యం అందజేయగలిగామన్నారు. మృతుల కుటుంబసభ్యులను ఓదార్చి, సంతాపాన్ని వ్యక్తం చేశామన్నారు.
దురదృష్టకర సంఘటనలో మృతిచెందిన వారిని తిరిగి తీసుకురాలేమని, వారి కుటుంబాలకు కొంతైనా ఆసరాగా ఉండాలని భావించామన్నారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.10 లక్షలు బుధవారం సాయంత్రానికల్లా అందజేశామన్నారు.
ఒకరిద్దరికి గురువారం సాయంత్రంలోగా అందజేయాలని జిల్లాల కలెక్టర్లకు సూచించినట్లు తెలిపారు. సంఘటన గురించి మథన పడుతూనే, భవిష్యత్తులో మరే చిన్న తప్పిదం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సిఎం చంద్రబాబుతోపాటు మంత్రులు, సభకు హాజరైనవారంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.