రాష్ట్ర విభజనపై మరోసారి కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసిన చంద్రబాబు
హైదరాబాద్: కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు వివాదంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు వ్యవహరించిన తీరుపై తాజాగా శుక్రవారం దుమ్మెత్తిపోశారు. ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని విభజించారని ఆయన మీడియా మసావేశంలో విమర్శించారు.
తాను వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికనే కాంగ్రెసు పార్టీ పట్టించుకోలేదని ఆయన అన్నారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీని, మంత్రుల కమిటీలను వేశారని, ఆ కమిటీలేవీ నివేదికలు సమర్పించలేదని, నివేదికలు సమర్పించకున్నా కాంగ్రెసు పార్టీ ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు పూనుకుందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ హైదరాబాదు విషయంలో చాలా చెప్పిందని, వాటిని పట్టించుకోలేదని ఆయన అన్నారు.
లోకసభ తలుపులు మూసేసి, కొంత మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసి అకస్తాత్తుగా ఇష్టానుసారంగా బిల్లును ఆమోదించారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకే చెందిన అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటు సభ్యులు వ్యతిరేకించినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ కుట్ర రాజకీయాలు చేసిందని ఆయన అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అంతా చేశారని ఆయన అన్నారు. విభజన వల్ల జరుగుతున్న నష్టాన్ని, అన్యాయాన్ని సవరించాలని అడిగినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ చేసిన సవరణలను పట్టించుకోలేదని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బ తిన్న స్థితిలో ఇరుపక్షాలతో సంప్రదింపులు జరపాలని కోరినా పట్టించుకోలేదని ఆయన విమర్శిచారు.
అక్టోబర్ 22 తర్వాత రాజధాని నిర్మాణం
అక్టోబర్ 22వ తేదీ తర్వాత రాష్ట్ర రాజధాని నిర్మాణం ప్రారంభమవుతుందని చంద్రబాబు చెప్పారు. ప్రతి శుక్రవారం సిఆర్డిఎ సమావేశం కావాలని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణంలో స్థానికులకు భాగస్వామ్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. మెరుగైన రవాణా వ్యవస్థ కోసం అత్యుత్తమ కన్సల్టెన్సీని తీసుకుంటామని ఆయన చెప్పారు.
కొత్త రాజధాని ఉపాధి కల్పనకు, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్ర రహదారులన్నీ గుంటూరు, విజయవాడలకు అనుసంధానం అవుతాయని ఆయన చెప్పారు. కృష్ణాన నది వరద నీటిని అంచనా వేస్తూ ప్రణాళికలను తయారు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.