అదీ చంద్రబాబు రాజకీయం - క్షణాల్లో అంతా తన గుప్పెట్లోకి..!!
40 ఇయర్స్ ఇండస్ట్రీ. మరో సారి తన రాజకీయ చతురత చూపించారు. రాష్ట్ర రాజకీయాల్లో సడన్ ఛేంజ్ కు కారణమయ్యారు. ప్రతిపక్షాలకు పెద్దన్నగా మారేందుకు వేదిక సిద్దం చేసుకున్నారు. అప్పటి వరకు పవన్ వర్సస్ వైసీపీ అన్నట్లుగా సాగుతున్న హై ఓల్టేజ్ రాజకీయాలను ఒక్క సారిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. పవన్ ఇబ్బందుల్లో ఉంటే తాను అండగా నిలిచేందుకు వచ్చాననే సంకేతాలు ఇచ్చారు. సీఎం జగన్ నిర్ణయాలతో పవన్ బాధపడుతున్నారని..ఈ సమయంలో ఎంట్రీ ఇవ్వటం ద్వారా పవర్ స్టార్ ఫ్యాన్స్ లో పాజిటివ్ ఒపీనియన్ తీసుకొచ్చే ప్రయత్నం చేసారు.
చంద్రబాబు మెరుపు నిర్ణయం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అప్పటికే పవన్ ను కలిసి మద్దతుగా నిలిచినా..అది పెద్దగా హైలైట్ కాలేదు. కానీ, స్వయంగా చంద్రబాబు హోటల్ లో బస చేసిన పవన్ దగ్గరకు వెళ్లి.. ఆయనకు విశాఖలో అవమానం జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారారు. విశాఖ గర్జన పేరుతో ప్రధానంగా చంద్రబాబును ఇరుకున పెట్టే వ్యూహం అధికార పార్టీ ముఖ్య నేతల మద్దతుతో మొదలైంది. టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా కౌంటర్ చేసే ప్రయత్నం చేసినా..పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. కానీ, పవన్ విశాఖలో ఎంట్రీ..అదే సమయంలో మంత్రులపై దాడులతో ఒక్క సారిగా సీన్ మారిపోయింది. నాలుగు రోజులుగా పవన్ సీఎం జగన్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు.. మంత్రుల ప్రతి విమర్శలతో రాజకీయం కొనసాగుతోంది.
పెద్దన్న పాత్రతో..పొలిటికల్ మైలేజ్
సోమవారం పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి మరీ చేసిన హెచ్చరికలతో ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. వైసీపీ వర్సస్ పవన్ అన్నట్లుగా మొత్తం రాష్ట్ర రాజకీయం నడుస్తోంది. ఆ సమయంలో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు.. 2024 ఎన్నికల చెలిమికి తొలి అడుగు వేసారు. చంద్రబాబు ఎంట్రీతో వైసీపీ విశాఖ గర్జన ఫలితాలు..పవన్ కళ్యాణ్ హెచ్చరికలు...అన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఇప్పుడు రాజకీయం మొత్తం 2024 లో టీడీపీ - జనసేన పొత్తు దిశగా నడుస్తోంది. బీజేపీ వైఖరి ఏంటనేది మాత్రమే స్పష్టత రావాల్సి ఉంది. చంద్రబాబు - పవన్ సమావేశంలో నాగబాబు.. నాదెండ్ల మనోహర్ తో పాటుగా అందరి సమక్షంలో కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఆ తరువాత చంద్రబాబు -పవన్ మధ్య ఏకాంత చర్చలు చోటు చేసుకున్నాయి. ఇద్దరూ మీడియా మందుకొచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తామని..మిగిలిన పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పొత్తు ఖాయం..తొలి అడుగు
కానీ, పవన్ అప్పటికే బీజేపీతో తన వైఖరి పైన తెగదెంపులే అని తేల్చకపోయినా..ఆ దిశగా సంకేతాలు ఇచ్చారు. కానీ, చంద్రబాబుకు బీజేపీ కూడా అవసరం. ఇటు వామపక్షాలు ఇప్పటికే చంద్రబాబుతో ఉన్నాయి. దీంతో..బీజేపీ వైఖరి తేలే వరకూ వేచి చూసే ధోరణి అవసరమని నిర్ణయించారు. అధికారికంగా వచ్చే ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనేది చెప్పకపోయినా.. సంకేతాలు మాత్రం చాలా క్లియర్ గా ఇచ్చారు. చంద్రబాబు - వపన్ సంయుక్త మీడియా మీట్ లో చంద్రబాబు తన లీడర్ షిప్ గురించి చెబుతుంటే.. పవన్ కొంత అసౌకర్యంగానే కనిపించారు. కానీ, కాదనలేని పరిస్థితి. కలిసి ముందుకు సాగాలే ఒప్పుకోక తప్పని సిట్యుయేషన్. అలా ముందుకెళ్దాం అంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనతో..మరో సారి రాజకీయం తన గుప్పెట్లోని తెచ్చుకోవటం లో చంద్రబాబు రాజకీయం ఎలా ఉంటుందో అందరికీ అర్దమవుతోంది.