ఎలా దోచుకోవాలనే: 100 ప్రశ్నలతో అంబటి ప్రజా బ్యాలెట్, బైక్ నడిపిన బాబు
హైదరాబాద్: ఎప్పుడు, ఎలా దోచుకోవాలనే కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ముందుకు వెళ్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం నాడు మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ మంగళవారం నాడు చేపట్టిన జనచైతన్య యాత్ర పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి చేసేది జన చైతన్య యాత్ర కాదని, ప్రజల పైన చేస్తున్న దండయాత్ర అన్నారు. అది ముమ్మాటికీ జన చైతన్య కాదని, కచ్చితంగా జనదోపిడీ యాత్ర అన్నారు.
అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్ధానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పరని, అలా కాకుండా నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, ఆ విషయం మర్చిపోయారా అని నిలదీశారు.
ఏపీపీఎస్సీ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదన్నారు. ఇటీవలె తనకు నచ్చిన వ్యక్తిని చైర్మన్గా నియమించుకున్నారని ఆరోపించారు. జన చైతన్య యాత్రలో ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తొలుత చంద్రబాబు బృందం చైతన్యవంతులు కావాలన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా వంద ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్ విడుదల చేసింది. చంద్రబాబు వైఫల్యాలన్నీ నిలదీస్తూ తాము ప్రజా బ్యాలెట్ ప్రచురించామని అంబటి చెప్పారు. తెలుగుదేశం పార్టీది జన ద్రోహ యాత్ర అన్నారు. కాపుల పైన చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కాలాయాపన చేసేందుకే బీసీ కమిషన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల లాగే బిసి రిజర్వేషన్లు అటకెక్కాయన్నారు.
వేమూరులో టిడిపి జనచైతన్యయాత్రలో పాల్గొన్న చంద్రబాబు
ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ప్రచారం కల్పించేందుకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి జనచైతన్య యాత్రలు చేపట్టింది. గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహించిన జనచైతన్య యాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో కలిసి సీఎం వేమూరులో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు బుల్లెట్ నడిపి కార్యకర్తల్లో హుషారు నింపారు. చిన్నపిల్లలను ఎత్తుకుని ఆనందించారు. ఫిర్యాదులు స్వీకరించారు.
కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత
టిడిపి చేపట్టిన జన చైతన్య యాత్ర కృష్ణా జిల్లాలోని కర్ర అగ్రహారంలో ఉద్రిక్తతకు దారి తీసింది. టిడిపి యాత్రను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. మంత్రిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.