కుట్రలో భాగస్వాములమా?: బాబు అఖిల పక్షాల భేటీపై వైసీపీ, బీజేపీ, జనసేన షాక్
అమరావతి: మంగళవారం ఉదయం 11గంటలకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కీలక పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనలు ఈ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రత్యేక హోదా కోసం పోరాడే అన్ని పార్టీలు ఈ సమావేశానికి హాజరు కావాలని ప్రభుత్వా వర్గాలు సోమవారం ఆహ్వాన లేఖలు రాసిన విషయం తెలిసింది. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ప్రతినిధులకు ఆహ్వానం అందింది.
బాబు మరో డ్రామా ఇది
కాగా, అఖిలపక్ష భేటీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖిలపక్ష సంఘాల సమావేశం పేరుతో చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని మండిపడింది. ఈ మేరకు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు కారణాలు తెలుపుతూ వైసీపీ ఓ లేఖను విడుదల చేసింది.
బాబు కుట్రలో భాగం కాలేం
చంద్రబాబు కుట్రలో తాము భాగస్వాములం కాలేమని వైసీపీ ఆ లేఖలో స్పష్టం చేసింది. హోదా ఉసురుతీసిన చంద్రబాబు.. ఇప్పుడు ఉద్యమానికి నాయకత్వం వహించడం ఏంటని ప్రశ్నించింది. పూటకో మాట, రోజుకో స్టేట్ మెంట్ ఇచ్చే బాబుపై నమ్మకం లేదని తెలిపింది. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించింది.
బాబూ రాజీనామా చేయించు..
కాగా, ‘చంద్రబాబు కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు. హోదా కంటే ప్యాకేజీ మేలన్నది చంద్రబాబే. వైయస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా నిర్వహించిన పోరాటాల వల్లే హోదా ఆకాంక్ష సజీవంగా ఉంది. హోదా క్రెడిట్ జగన్కు వస్తుందేమోననే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే అఖిలపక్ష డ్రామాకు తెరతీశారు' అని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. ఒకవేళ చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలతోనూ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబుకు అఖిలపక్షం ఎందుకు గుర్తుకురాలేదని నిలదీశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే అఖిలపక్ష సంఘం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
ఉపయోగం?.. జనసేన కూడా దూరమే
ఇది ఇలావుంటే.. జనసేన పార్టీ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిసింది. హోదాపై స్పష్టతలేని చంద్రబాబు.. ఇప్పుడు అఖిల పార్టీల సమావేశం నిర్వహించడంలో లాభం లేదని పేర్కొంది. ఈ సమావేశం వల్ల ఎవరికీ ఉపయోగం లేదని జనసేన అభిప్రాయపడింది. కాగా, అఖిలపార్టీల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి గిడుగు రుద్రరాజు, గౌతం హాజరవుతున్నారు. సీపీఎం నుంచి మధు, వెంకటేశ్వరరావు హాజరవుతున్నారు.
టార్గెట్ చేస్తూనే పిలుస్తారా? అంటూ బీజేపీ
ఇది ఇలావుంటే, బీజేపీని టార్గెట్ చేసి ఇప్పుడు సమావేశానికి ఎలా వెళ్తామని ఆ పార్టీ నేతలు కూడా బాబు అఖిలపార్టీ భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. బీజేపీ ద్రోహం చేశారంటూ మళ్లీ ఎందుకు పిలుస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. అయితే, ఈ సమావేశానికి వెళ్లకపోతే తప్పుడు సందేశాలు వెళతాయని మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఈ భేటీకి హాజరు విషయమై ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నట్లు తెలిసింది.