ఆ తర్వాతే మోడీకి ఎదురు తిరిగారు!: ఒక్కటైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు అంశం పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కటయ్యారు!
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు అంశం పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కటయ్యారు! ఓ వైపు మోడీ నోట్ల రద్దును స్వాగతిస్తూనే, జనాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇరువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. దీనిని చంద్రబాబు, పవన్ ఆ తర్వాత రెండు రోజుల్లో సమర్థించారు. అయితే, నోట్ల రద్దు నేపథ్యంలో.. చిన్న నోట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూ కట్టారు.
దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కేంద్రంపై ఒకింత రివర్స్ అయ్యారు. నోట్ల రద్దు సరైనదని చెబుతూనే, ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని చంద్రబాబు, పవన్లు అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు రివర్స్
నోట్ల రద్దు ప్రకటన వెంటనే చంద్రబాబు స్వాగతించారు. తాను చాలా ఏళ్లుగా రూ.500, రూ.1000 నోట్ల రద్దును డిమాండ్ చేస్తున్నానని, ప్రధాని మోడీకి లేఖ కూడా రాశానని ప్రకటించారు. ఇది సరైన నిర్ణయమన్నారు. అయితే, నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో.. స్వాగతిస్తూనే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోలేకపోయారని కేంద్రంపై ఎదురు తిరిగారు!
రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. పన్నెండు రోజులు అయినా సాధారణ పరిస్థితికి రాకపోవడం ఏమిటని కేంద్రాన్ని పరోక్షంగా ప్రశ్నించారు. రూ.50, రూ.100 అవసరమైనన్ని నోట్లు ఇవ్వాలన్నారు. అలాగే, రూ.2000 నోటును తీసుకు రావడాన్ని తప్పుబట్టారు. రూ.200 నోటును తీసుకు రావాలన్నారు.
మరోవైపు, పవన్ కళ్యాణ్ అనంతపురంలో నోట్ల రద్దును స్వాగతించారు. అయితే, రెండో రోజుల క్రితం ఆయన ట్విట్టర్ వేదికగా ప్రజా సమస్యల నేపథ్యంలో కేంద్రం తీరును ఎండగట్టారు. నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోందని ఆగ్రహించారు. మొత్తానికి 2014 నుంచి మోడికి అండగా ఉన్న పవన్, చంద్రబాబులు నోట్ల విషయంలోను స్వాగతించినప్పటికీ, ప్రజల ఇబ్బందులను గుర్తించి, తర్వాత రివర్స్ కావడం గమనార్హం.