జగన్ కు చంద్రబాబు ఫోన్ కాల్-కానీ ఏం జరిగిందంటే ?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి పలువురు వీఐపీలకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఇందులో సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఇదే క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కు కూడా చంద్రబాబు స్వయంగా ఫోన్ చేశారు. అయితే జగన్ మాత్రం అందుబాటులో లేకుండా పోయారు.

రేపు గన్నవరంలో జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, రజనీకాంత్, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. వీరికి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపడంతో పాటు వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు ఫోన్ కాల్స్ చేసి ఆహ్వానిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా జగన్ కు కూడా కాల్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన మాత్రం అందుబాటులోకి రాలేదని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు రేపటి చంద్రబాబు ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఫోన్ కాల్ లోనూ చంద్రబాబుకు జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. జగన్ తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. గతంలో జగన్ తన ప్రమాణస్వీకారానికి చంద్రబాబును రావాలని కోరినా ఆయన కూడా వెళ్లలేదు. దీంతో ఇప్పుడు జగన్ కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications