కాపులు మావెంటే: రిజర్వేషన్లపై బాబు, ఈ అమ్మాయిని చూసి మీడియా నేర్చుకోవాలి
ఏలూరు: ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీ మేరకు కాపుల రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురంలో జరిగిన జన్మభూమ - మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. కాపు కులస్థులను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీలు ఎప్పుడూ పార్టీని వెన్నంటే ఉన్నారని, వారిని మర్చిపోతే తనను తాను మర్చిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.
కొన్ని పార్టీలు బీసీలపై దొంగ ప్రేమను కురిపిస్తున్నాయని, వారు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారో చెప్పాలన్నారు. కాపులు ఎప్పటికీ టిడిపి వెంటే ఉంటారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏం చేయలేని నేతలు ఇప్పుడు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రతి ఒక్కరూ ఆదాయం పెంచుకునేలా మార్గాలు అన్వేషించాలని సూచించారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా నిల్వ చేసుకోవడం ద్వారా నీటి కొరతకు స్వస్తి పలకాలన్నారు.
భూగర్భ జలాలను పెంచేందుకు కుంటలు, తవ్వడం, చెరువుల్లో పూడిక తీయడం వంటి పనులు చేపట్టాలన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరవు పరిస్థితులను పారద్రోలేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
పాపను చూసి మీడియా నేర్చుకోవాలి
తిరుపతిలోని మున్సిపల్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న రాజేశ్వరి జన్మభూమి వేదిక పైన చంద్రబాబు నుంచి ట్యాబ్ను కానుకగా తీసుకుంది. తమ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణంతో పెరిగిన ఆత్మగౌరవ అనుభూతిని ఆమె జన్మభూమి వేదికపై పంచుకుంది. అనర్గళంగా మాట్లాడింది.
ఆమె ప్రసంగాన్ని చూసి చంద్రబాబు కూడా ఆనందపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు గ్యాలరీలోని మీడియాను చూస్తూ... రాజేశ్వరిని చూసి ప్రెస్ వాళ్లు నేర్చుకోవాలని వ్యాఖఅయానించారు. మనవాళ్లు కూడా రాజేశ్వరి మాదిరిగా మాట్లాడలేరని వేదికపై ఉన్న నేతలను ఉద్దేశించి అన్నారు.